హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో కొత్త జిల్లాలకు నవోదయ విద్యాలయాలను ఎప్పుడు ఏర్పాటు చేస్తారని టీఆర్ఎస్ ఎంపీలు కేంద్రాన్ని మరోసారి నిలదీశారు. జిల్లాకు ఒక నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని చట్టంలో ఉన్నా ఎందుకు అమలు చేయటం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నాయని, ఇప్పటిదాకా 9 నవోదయ విద్యాలయాలు మాత్రమే ఏర్పాటు చేశారని గుర్తుచేశారు.
సోమవారం లోక్సభలో టీఆర్ఎస్ ఎంపీలు బీబీ పాటిల్, మాలోత్ కవిత, వెంకటేశ్ నేత, పసునూరి దయాకర్, గడ్డం రంజిత్రెడ్డి నవోదయాలు, కేంద్రియ విద్యాలయంపై కేంద్రాన్ని నిలదీశారు. దీనిపై స్పందించిన కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణదేవి.. 2014 మే చివరి నాటికి ఉన్న జిల్లాల్లోనే జిల్లాకు ఒకటి చొప్పున నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేశామని లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.
కొత్త నవోదయాల ఏర్పాటు నిరంతర ప్రక్రియ అని, నిధుల లభ్యత ఆధారంగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. తెలంగాణలో 35 కేంద్రియ విద్యాలయాలు ఉన్నాయని, వాటిలో 1,467 మంది బోధన, బోధనేతర సిబ్బంది ఉన్నారని చెప్పారు. వీటిల్లో 36,731 మంది విద్యార్థులు చదువుతున్నారని వివరించారు. రాష్ట్రంలోని 35 కేంద్రియ విద్యాలయాల్లో 26 శాశ్వత భవనాల్లో ఉన్నాయని, మిగతావి అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.