చేనేతపై జీఎస్టీ విధించవద్దంటూ ప్రధానమంత్రి మోదీకి లేఖ
హైదరాబాద్, ఏప్రిల్ 4 : చేనేతపై జీఎస్టీ విధించవద్దని చేస్తున్న పోరాటంలో భాగంగా చేనేత మహా వస్త్ర లేఖపై సోమవారం టీఆర్ఎస్ ఎంపీలు సంతకాలు చేశారు. అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం ఆధ్వర్యంలోదేశవ్యాప్తంగా ఉన్న సామాజిక ఉద్యమకారులు, పార్లమెంటు సభ్యులు, వివిధ రాష్ట్రాల శాసనసభ, శాసనమండలి సభ్యుల సంతకాలతో ప్రధాని మోదీకి చేనేత మహా వస్త్ర లేఖ రాస్తున్నారు. మహా వస్త్ర లేఖపై ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే తొలి సంతకం చేశారు. సోమవారం ఢిల్లీలో ఆ లేఖపై టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్సభలో టీఆర్ఎస్ పక్షనేత నామా నాగేశ్వరరావు, ఎంపీలు కేఆర్ సురేశ్రెడ్డి, మాలోత్ కవిత, కొత్త ప్రభాకర్రెడ్డి, బీబీ పాటిల్, వెంకటేశ్ నేత, బడుగుల లింగయ్యయాదవ్, రంజిత్రెడ్డి, మన్నె శ్రీనివాస్రెడ్డి, పసునూరి దయాకర్, పీ రాములు సంతకాలు చేశారు. కార్యక్రమంలో అఖిల భారత పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడు కందగట్ల స్వామి, ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథం, చేనేత విభాగం జాతీయ అధ్యక్షుడు యర్రమాద వెంకన్న నేత, తెలంగాణ పద్మశాలి యువజన సంఘం అధ్యక్షుడు అవ్వారి భాసర్ తదితరులు పాల్గొన్నారు.