న్యూఢిల్లీ : ఈ నెల 7వ తేదీ నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళవారం బీఏసీ సమావేశం జరిగింది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశానికి టీఆర్ఎస్ లోక్సభా పక్ష నేత నామా నాగేశ్వర్ రావు హాజరయ్యారు. రాష్ట్ర విభజన హామీలపై చర్చించాలని ఆయన పట్టుబట్టారు. రైతు, నిరుద్యోగ సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేశారు. రైల్వే, హైవేలతో పాటు పలు అంశాలపై చర్చించాలని నామా నాగేశ్వర్ రావు బీఏసీలో డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేయాలని టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 7వ తేదీ నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సోమవారం ఆయన ప్రగతిభవన్లో పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు. కేంద్రం తెలంగాణపై అన్ని రంగాల్లో చూపుతున్న వివక్షను దేశానికి తెలిపేలా ఎండగట్టాలని ఎంపీలకు సీఎం మార్గనిర్దేశం చేసినట్టు తెలిసింది. అంశాలవారీగా ఏం చేస్తే బాగుంటుందని ఎంపీలతో చర్చించినట్టు సమాచారం. రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేండ్లు అయినా కేంద్రం తెలంగాణకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయని వైనంపై పార్లమెంట్ వేదికగా ప్రశ్నించాలని సూచించినట్టు తెలిసింది.
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన వర్సిటీ, ఐఐఎం స్థాపన తదితర అంశాలపై ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క టీ కేంద్రం నెరవేర్చలేదు. కార్యాచరణ ప్రకటించలేదు. కృష్ణా, గోదావరి నదీ జలాల వాటా తేల్చకుండా నాన్చుడు ధోరణినే అనుసరిస్తున్నది. ‘తెలంగాణ, ఏపీ రెండు రాష్ర్టాలు విభజన అంశాలపై కొట్టుకుంటూ ఉండాలి.. మనం తమాషా చూద్దాం’ అన్నట్టుగా మోదీ సర్కార్ వ్యవహరిస్తున్నదనే విషయాన్ని పార్లమెంట్లో ఎండగట్టాలని సీఎం కేసీఆర్ ఎంపీలకు దిశానిర్దేశం చేసినట్టు సమాచారం.
రాష్ర్టానికి రావాల్సిన నిధులు, నీతి ఆయోగ్ వంటి సంస్థలు చేసిన సిఫారసులు, 13,14,15వ ఆర్థిక సంఘాలు సూచించిన మేరకు నిధులు విడుదల చేయకపోవడం, రుణం పొందే విషయంలోనూ ఆంక్షలు విధించి తెలంగాణపై కేంద్రం కక్షగట్టిన వైనాన్ని ఎండగట్టాలని ఎంపీలకు చెప్పినట్టు తెలుస్తున్నది. 16 రోజులపాటు కొనసాగే శీతాకాల సమావేశాల్లో కేంద్రం దాదాపు 20 బిల్లులను ప్రవేశపెట్టబోతున్నది. ఆయా బిల్లులతో దేశానికి ఏ విధమైన ప్రయోజనం? తెలంగాణకు ఏ మేరకు ప్రయోజనం? అనే కోణంలో ప్రతి ఒక్కరూ క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని ఎంపీలకు సూచించినట్టు సమాచారం. పార్లమెంట్ సమావేశాలు జరిగినన్ని రోజులు.. ప్రతిరోజూ ఏ వ్యూహాన్ని అనుసరించాలి? ఏమి చేస్తే తెలంగాణకు మేలు జరుగుతుంది? అనే కోణంలో కార్యాచరణ ఉండాలని దిశానిర్దేశం చేసినట్టు సమాచారం.