ఎవరి దయాదాక్షిణ్యాలతోనో రాష్ట్రం ఏర్పడలేదు
కాంగ్రెస్ రాష్ట్ర ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ ట్వీట్పై
ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం
హైదరాబాద్, ఫిబ్రవరి 14 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కేంద్రం భిక్ష కాదని, ఎవరి దయాదాక్షిణ్యాలతోనో ఏర్పడలేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో సాగిన ప్రజా ఉద్యమాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని స్పష్టంచేశారు. ప్రజాపోరాటంలో ఆఖరికి సత్యమే గెలిచిందని చెప్పారు. ప్రజా ఉద్యమానికి తలొగ్గి కేంద్రం తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటు చేసిందని, అది కేంద్రం ఇచ్చిన బహుమానం కాదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్గాంధీని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ అనరాని మాటలు అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయాలకు అతీతంగా స్పందించారని కవిత తెలిపారు. ఇది కేసీఆర్ ఔన్నత్యానికి నిదర్శమని చెప్పారు. కేసీఆర్పై రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలు చేసే ముందు ఆలోచించుకోవాలని ఆమె మాణిక్కం ఠాగూర్కు హితవు పలికారు.