వరంగల్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపర్చడం కోసం యశోద చారిటబుల్ ఫౌండేషన్ ఎంతో కృషి చేస్తున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పేర్కొన్నారు. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని మేడిపల్లి-రాంపూర్లో ఫౌండేషన్ తరఫున రూ.1.5 కోట్ల వ్యయంతో నిర్మించిన యశోద సేవాకేంద్రం, మెగా ఫంక్షన్హాల్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కాంప్లెక్స్ను బుధవారం యశోద హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గోరుకంటి దేవేందర్రావుతో కలిసి సుదర్శన్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామస్థులతోపాటు పరిసర గ్రామాల ప్రజలకు, నిరుద్యోగులకు, అనాథలకు, యువతకు ఉపాధి అవకాశాలు పెంచడానికి ఈ సేవా కేంద్రం ఉపయోగపడుతుందని చెప్పారు. కష్టపడి ఉన్నతస్థాయికి ఎదిగిన యశోద హాస్పిటల్స్ నిర్వాహకులు పుట్టిన ఊరిని మరచిపోకుండా సేవ చేయడం గొప్ప విషయమని అభినందించారు. అనంతరం దేవేందర్రావు మాట్లాడుతూ.. పిల్లలను చదివించడమే తల్లిదండ్రులు వారికిచ్చే ఆస్తి అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో నేర్చుకుని, ఉపాధి పొందటానికి కుట్టుమెషిన్లు, కంప్యూటర్లను ఏర్పాటు చేశామని, శిక్షకులను కూడా నియమించామని తెలిపారు.