హైదరాబాద్ : అభివృద్ధి చెందుతున్న తెలంగాణను రాజకీయంగా ఎదుర్కోలేకనే.. రాష్ట్రంపై ఐటీ, ఈడీ, సీబీఐ దాడులు చేయిస్తున్నదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ ఆరోపించారు. మునుగోడు ఓటమిని జీర్ణించుకోలేకనే బీజేపీ రాజ్యాంగ సంస్థలను రాజకీయ సంస్థలుగా వాడుకుంటుందని ధ్వజమెత్తారు. బుధవారం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో వివేకానంద మీడియాతో మాట్లాడారు.
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో తెలంగాణ రాష్ర్టానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్యాకేజీలు, పథకాలు తదితర అంశాలపై చర్చిస్తారని ప్రజలు ఆశించారని, తీరా సమావేశాల్లో కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులపై విషం కక్కారని ఆయన ధ్వజమెత్తారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మొసలి కన్నీరుకార్చారని ఆయన మండిపడ్డారు. టీఆర్ఎస్కు ఉన్న ప్రజాధరణ, సీఎం కేసీఆర్ నాయకత్వ పటిమను తట్టుకోలేక బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్రెడ్డి సహా రాష్ట్ర బీజేపీ నాయకత్వం అంతా చేతులెత్తేస్తే మోదీ ఈడీ, ఐటీ, సీబీఐ వంటి సంస్థలను ఉసిగొల్పుతున్నారని ఆయన మండిపడ్డారు. త్వరలో ఈడీ.. ఐటీ.. సీబీఐ అని పదే పదే బండి సంజయ్ చెప్పినట్టే రాష్ట్రంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయని, వాటిని ఎదుర్కొంటామని ఆయన స్పష్టం చేశారు.