హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజ్భవన్ను రాజకీయభవన్గా మార్చారని పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్రెడ్డి ఎద్దేవాచేశారు. తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా పనిచేసిన తమిళిసైకి రాజకీయాలపై ఆసక్తి ఉంటే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో రాజీనామా చేయించి, ఆ స్థానాన్ని చేజిక్కించుకొని రాజకీయాలు చేయొచ్చని సూచించారు. టీఆర్ఎస్లోనూ చేరొచ్చని పేర్కొన్నారు. కానీ గవర్నర్గా ఉంటూ రాజకీయాలు చేయడం తగదని, హుందాగా వ్యవహరించాలని హితవు చెప్పారు. శనివారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్ ప్రజాదర్బార్ నిర్వహించడం ప్రజాస్వామ్య విరుద్ధమని చెప్పారు. బీజేపీ రాష్ర్టాల్లోని గవర్నర్లు కూడా తమిళిసై మాదిరిగా ప్రజాదర్బార్లు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ప్రధాని మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు రాజకీయాలతో సంబంధం లేనివారినే గవర్నర్లుగా నియమించాలంటూ చేసిన వ్యాఖ్యల క్లిప్ను ఈ సందర్భంగా ప్రదర్శించారు. నాడు ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వ గవర్నర్గిరీని వ్యతిరేకించిన మోదీ ఇప్పుడు ప్రధానిగా చేస్తున్నదేమిటని నిలదీశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సీబీఐ, ఈడీ, ఐటీ విభాగాలతో పాటు గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని రాష్ర్టాలపై పెత్తనం చెలాయించాలని చూస్తున్నదని మండిపడ్డారు. బీజేపీ నేతల కన్నా గుంటనక్కలు నయమని ఎద్దేవా చేశారు.
అర్వింద్ నోరు అదుపులో పెట్టుకో
సొంత డబ్బులతో దేవాలయం కట్టించిన ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి.. బీజేపీ ఎంపీ అర్వింద్ చేసిన అనుచిత వ్యాఖ్యలను జీవన్రెడ్డి తప్పుబట్టారు. బీజేపీ నాయకులు మాత్రమే హిందువులైనట్టు, తక్కిన వాళ్లు కానట్టు వ్యవహరించే పద్ధతి మంచిది కాదని హితవు చెప్పారు. బీజేపీ నేతలు ఎన్ని దేవాలయాలు నిర్మించారని ప్రశ్నించారు. యాదగిరిగుట్ట పునర్నిర్మాణంతో పాటు అనేక ఆలయాలకు పూర్వ వైభవం తెచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని చెప్పారు.
దేశ్కీ నేత కేసీఆర్కు ఎవరూ సాటిరారు
ఎవరెన్ని కుట్రలు చేసినా రాష్ట్రంలో టీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చి, హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని జీవన్రెడ్డి పేర్కొన్నారు. దేశంలో గుజరాత్ మోడల్ విఫలమైందని, తెలంగాణ నమూనాను దేశ ప్రజలు కోరుకొంటున్నారని, సీఎం కేసీఆర్ దేశ్ కీ నేత అవటం ఖాయమని చెప్పారు. గుజరాత్ సీఎంగా పనిచేసిన మోదీ ప్రధాని అయినట్టే, అన్ని అర్హతలున్న సీఎం కేసీఆర్ దేశానికి ప్రధాని కాకూడదా? అని ప్రశ్నించారు.
జూబ్లీహిల్స్ ఘటన నిందితులకు కఠిన శిక్షలు
జూబ్లీహిల్స్లో బాలికపై సామూహిక లైంగికదాడికి పాల్పడిన వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని జీవన్రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో ప్రభుత్వం రాజీపడదని తెలిపారు.