హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణలో రక్తం పారించాలని చూస్తే.. బిడ్డా ఖబడ్దార్.. అలాంటి వాళ్లందరికీ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు పట్టిన గతే పడుతుంది’ అని ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు. రాష్ట్రంలో అశాంతికి ప్రయత్నిస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు. హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో జరిగిన కార్యక్రమంలో మహబూబ్నగర్కు చెందిన సహాయ ఫౌండేషన్ చైర్మన్ టంకరి శివప్రసాద్తో పాటు కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎంకు చెందిన సుమారు 300 మంది మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మతకలహాలు సృష్టించాలని ప్రయత్నించిన రాజాసింగ్పై పీడీ యాక్ట్ నమోదు చేసి అరెస్టు చేసినట్టుగానే, ఎవరు చేసినా కఠినంగా అణచివేస్తామని తేల్చి చెప్పారు.
రాష్ర్టాన్ని ఆగం చేయాలని, మతకలహాలు సృష్టించాలని ప్రయత్నిస్తే ఎంతటి పెద్ద నాయకుడినైనా వదిలే ప్రసక్తే లేదని తెలిపారు. తెలంగాణ ప్రజల ప్రాణాలకు ఎవరు హాని కలిగించాలని చూసినా వారిని వదలబోమని అన్నారు. బీజేపీ నేతలు అసందర్భ, అసత్య ప్రసంగాలను ప్రజలు గమనిస్తున్నారని వెల్లడించారు. ఆ పార్టీ నేతల ఈడీ, పీడీ బుడ్డ బెదిరింపులకు సీఎం కేసీఆర్ భయపడరని స్పష్టం చేశారు. మతకలహాలతో ఓట్లు కొల్లగొట్టాలని చేస్తున్న బీజేపీ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్గుప్తా, ముడా చైర్మన్ గంజి వెంకన్న ముదిరాజ్, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేశ్, కౌన్సిలర్ కిశోర్, రామచంద్రపురం సర్పంచ్ కుర్వ శ్రీనివాస్యాదవ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు గంధం రాములు, సత్యం యాదవ్, రాములు, భాస్కర్, మోహన్ నాయక్, దాసరి కన్న, శివశెట్టి, మహిళా నాయకులు అనితారెడ్డి, వాణి, సాయిలక్ష్మి, లత తదితరులు పాల్గొన్నారు.