హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ నాయకుడు, పార్టీ ఇన్సూరెన్స్ విభాగం నిర్వాహకుడు కావేటి లక్ష్మీనారాయణ (57) సోమవారం గుండెపోటుతో మృతిచెందారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన ఆయన ఆరున్నరేండ్లుగా టీఆర్ఎస్ ఇన్సూరెన్స్ విభాగం బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. హైదరాబాద్ మూ సాపేటలో ఉంటున్న లక్ష్మీనారాయణకు సోమవారం గుండెపోటు రావడంతో దవాఖానకు తరలిస్తుండగా ప్రాణాలు విడిచారు. ఆయనకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు, కోడలు పుణెలో వైద్యులు. ఒక కుమార్తె కెనడాలో, మరొకరు హైదరాబాద్లో ఉంటున్నారు. టీఆర్ఎస్ కార్యకర్తల ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ సాఫీగా కొనసాగేందుకు లక్ష్మీనారాయణకు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ బాధ్యతలు అప్పగించారు. లక్ష్మైనారాయణ మృతిపై సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తంచేశారు. కావేటి మరణంతో సేవాతత్పరత, నిబద్ధత గల నాయకుడిని పార్టీ కోల్పోయిందని విచారం వ్యక్తంచేశారు.
ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కావేటి మరణం పార్టీకి తీరని లోటని, చాలా బాధాకరమని వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పార్టీ బీమా విభాగం బాధ్యుడిగా వందల మంది కార్యకర్తల కుటుంబాలకు విశేషసేవలు అందించారని గుర్తుచేసుకున్నారు. మంగళవారం లక్ష్మీనారాయణ మృతదేహానికి మంత్రి కేటీఆర్ పూలమాల వేసి నివాళులర్పిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. కావేటి మృతిపై స్పీకర్ పోచారం, మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, గంగుల కమలాకర్, ప్రశాంత్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, కొప్పుల ఈశ్వర్, నిరంజన్రెడ్డి, సత్యవతిరాథోడ్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి, ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్రెడ్డి సంతాపం వ్యక్తంచేశారు.