హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): రైతునెట్లా ఆదుకోవాలా అని తాము తాపత్రయపడుతుంటే, కేసీఆర్ను ఎట్లా గద్దెదించాలా అని బీజేపీ కుట్రలు చేస్తున్నదని ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ మండిపడ్డారు. బీజేపీకి అధికార యావ తప్ప ప్రజా సమస్యలను పరిష్కరించాలన్న ఆలోచనే లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. బుధవారం తెలంగాణభవన్లో ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, మాజీ ఎమ్మెల్సీ మాదిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ నేతలు గెల్లు శ్రీనివాస్యాదవ్, రామ్మూర్తి, టీఆర్ఎస్కేవీ నేత రూప్సింగ్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే యాసంగి కొనుగోళ్లపై తేల్చాలని తాము పట్టుబడితే.. పోయిన వానకాలం పంటపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడటం రైతులను గందరగోళ పరచటమేనని అన్నారు. సక్రమంగా జవాబు చెప్పలేనివాళ్లు అంశాన్ని పక్కదారి పట్టిస్తారని, గోయల్ తీరు అలాగే ఉన్నదని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో వానకాలం, యాసంగి రెండు కాలాల్లో వరి పండుతుందని దేశమంతా అర్థమైంది కానీ గోయల్కు, రాష్ర్ట బీజేపీ నేతలకు అర్థం కాలేదని ఎద్దేవాచేశారు. పట్టణ వాతావరణంలో పుట్టి పెరిగిన గోయల్కు రైతుల కష్టాలు ఏమి తెలుసని ప్రశ్నించారు. ప్రజాపంపిణీ వ్యవస్థపై ఆయనకు ఏబీసీడీలు కూడా రావన్నారు. ఢిల్లీ వెళ్లిన మంత్రులు, ఎంపీలను పనీపాట లేకుండా వస్తున్నారని గోయల్ వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా ఖండించారు.
గత సెప్టెంబర్లో సీఎం ఢిల్లీ పర్యటన సందర్భంగానే గోయల్ పంటల మార్పిడి చేయాలని సూచించారని వినోద్ గుర్తుచేశారు. రైతులు ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో పంటల మార్పిడికి తాము పిలుపునిస్తే.. రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం వరి వేయాలని రైతులను ఉసిగొల్పారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తర్వాత కేంద్ర నాయకులు వారి నాలుకలపై చురకలు అంటించారని చెప్పారు. బండి సంజయ్, కిషన్రెడ్డి, ఇతర నేతలు తమ అధినేత అమిత్షాను కలిసినప్పుడు రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని మాటవరుసకైనా కోరకపోవడం దుర్మార్గమన్నారు. బీజేపీ నేతలకు ఎంతసేపూ కేసీఆర్ను ఎట్లా గద్దె దించాలి? ఎట్లా దాడులు చేయాలి? అని ఆలోచించడమే సరిపోతున్నదని చెప్పారు. యాసంగి వడ్లు కొనాలంటూ ఎందుకు అడగటంలేదని ప్రశ్నించారు. కర్ణాటకలో అప్పర్ భద్రకు రూ.16 వేల కోట్లతో జాతీయ హోదా ఇచ్చిన కేంద్రం తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు ఒక్క పైసా ఇవ్వలేదని గుర్తుచేశారు. యూపీలో రూ.39 వేల కోట్లతో.. బుందేల్ఖండ్లో, మధ్యప్రదేశ్లో ప్రాజెక్టులకు కూడా జాతీయ హోదా ఇచ్చారన్నారు. ‘రాష్ట్ర బీజేపీ నేతలారా.. నలుగురు ఎంపీలను తెలంగాణ ఇచ్చింది. మీరేం చేస్తున్నారు?’ అని వినోద్ సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో విద్యాసంస్థలను నెలకొల్పాలని వంద లేఖలు రాశామని.. తాను ఎంపీగా ఉన్నప్పుడు గొంతుపోయేలా మొత్తుకొన్నామని, ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ మొక్కుబడి లేఖ రాశారని చెప్పారు. బండి అండ్ కో బృందానికి దమ్ముంటే పాలమూరు లేదా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తేవాలని డిమాండ్చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా రెండేండ్ల గడువు ఉన్నదని, ఎన్నికల సమయంలో ఎవరు గద్దెనెక్కాలో.. ఎవరు దిగాలో ప్రజలు నిర్ణయిస్తారన్నారు. తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ర్టాల్లో పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పక్షాలూ రాష్ట్ర ప్రయోజనాలకోసం పాటుపడతాయని, దురదృష్టవశాత్తూ ఇక్కడ ఆ పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తంచేశారు. యాసంగి పంటను కొంటామని కేంద్రం లిఖిత పూర్వక హామీ ఇవ్వాలన్నారు. ప్రజలను, రైతులను రెచ్చగొట్టే విధానం బీజేపీ ఇప్పటికైనా మానుకోవాలని వినోద్కుమార్ హితవుచెప్పారు.