హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): ఉస్మానియా యూనివర్సిటీ లోగోను టీఆర్ఎస్ ప్రభుత్వం మార్చిందని కొందరు తప్పుడు ప్రచారంచేస్తున్నారని హోం మంత్రి మహమూద్ అలీ సోమవారం పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ సెక్యులర్ నాయకుడని, అన్ని మతాలను సమానంగా గౌరవిస్తారని చెప్పారు. లోగోను మార్చారంటూ కొందరు ఆరోపిస్తున్న నేపథ్యంలో పరిశీలన జరుపాలని ఓయూ ఉర్దూ విభాగం శాఖాధిపతి ప్రొఫెసర్ ఎస్ఏ షుకూర్ను కోరామన్నారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం 1951లో లోగోలో కొంత మార్పు జరిగిందని, 1960లో పూర్తిగా లోగోను మార్చివేశారని తేలిందన్నారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నదని చెప్పారు. కావాలంటే 1960 తర్వాత ధ్రువపత్రాలు ఉన్నవారు లోగోను పరిశీలించవచ్చని చెప్పారు. నిరాధార వార్తలను నమ్మవద్దని కోరారు.