హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని మైనార్టీలకు 12% రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర అసెంబ్లీ, మండలిలో తీర్మానం చేసి పంపినట్టు తెలిపారు. ప్లీనరీలో మైనార్టీల రి జర్వేషన్ల పెంపుపై తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. గతంలో కాంగ్రెస్, టీడీపీ పాలకులు మైనార్టీలను పట్టించుకోలేదని విమర్శించారు.
రాష్ట్రంలోని గిరిజనులకు రిజర్వేషన్లను 10 శాతానికి పెంచాలని, దీనికి రాజ్యాంగబద్ధత కల్పించి 9వ షెడ్యూల్లో చేర్చాలని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ డిమాండ్ చేశారు. ప్లీనరీలో మాట్లాడుతూ.. సమైక్య రాష్ట్రంలో 6.6 శాతంగా ఉన్న గిరిజన జనాభా.. తెలంగాణలో 10 శాతానికి చేరుకొన్నదన్నారు.
పార్లమెంట్లో వెంటనే ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించాలని ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్లీనరీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఎస్సీ వర్గీకరణకు బీజేపీ సహా అన్ని పార్టీలు మద్దతు తెలిపాయన్నారు.