TRS complaint |మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిపై టీఆర్ఎస్ నేతలు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. వేల కోట్ల ప్రాజెక్టు తీసుకొని బీజేపీలో చేరానని చెప్పిన ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ను ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎన్నికల అధికారిని కలిసిన వారిలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే గాదరి కిషోర్, పార్టీ జనరల్ సెక్రటరీలు శ్రీనివాస్రెడ్డి, సోమ భరత్ ఉన్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.
మునుగోడులో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్టి తాను రూ.18 వేల కోట్ల ప్రాజెక్టు తీసుకొని బీజేపీలో చేరానని ఓ న్యూస్ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారని. అందుకని రాజగోపాల్ రెడ్డిని అసెంబ్లీ బైపోల్లో పోటీ చేయకుండా అనర్హుడిని చేయాలని రాష్ట్ర ఎన్నికల అధికారికి మెమోరాండం సమర్పించారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటూనే బీజేపీ ప్రభుత్వం నుంచి రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు తీసుకున్నట్టు ఓ టీవీ చానల్లో స్వయంగా చెప్పారని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ పేర్కొన్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అవహేళన చేసే చర్య అని, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ను గాలికి వదిలేశారని విమర్శించారు. ఇచ్చి పుచ్చుకోవడం కింద ఇలాంటి పనులు చేసారని ఎన్నికల ప్రధాన అధికారికి విన్నవించామని చెప్పారు. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి రాజగోపాల్ రెడ్డిని మునుగొడులో పోటీ చేయకుండా డిస్క్వాలిఫై చేయాలని ఆయన ఈసీని కోరారు. కాంట్రాక్ట్లలో వచ్చిన డబ్బు సంచులతో మునుగోడులో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు.
బీజేపీ నాయకులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిని ఎన్నికల్లో నిలబడేందుకు ప్రోత్సాహించవద్దని ఎన్నికల అధికారిని కోరామని చెప్పారు. ఈటెల రాజేందర్, వివేక్లకు కూడా వాటా ఇస్తానని రాజ్గోపాల్ రెడ్డి చెప్పినట్లు తెలిసిందని అన్నారు. రాజగోపాల్ రెడ్డి మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని మోదీ, అమిత్షా కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టాడని దుయ్యబట్టాడు. ఇలాంటి లంగకు ప్రజలు చెప్పుతో కొట్టేలా తీర్పు ఇస్తారని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ప్రజల కోసం మునుగోడు అభివృద్ది కోసం రాజగోపాల్రెడ్డి ఏనాడూ పని చేయలేదని, కేవలం పైసల అహంకారం ఆయనలో ఉన్నదని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు దేశవ్యాప్తంగా వస్తున్న ఆదరణ చూసి బీజేపీ వాళ్ళు కృత్రిమ ఎన్నిక తెచ్చారని, రాజగోపాల్ రెడ్డి, బీజేపీ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇలాంటి దొంగలను ప్రజలు తరిమికొట్టడం ఖాయమని, మునుగోడులో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు.