గరిడేపల్లి, మే 25 : జ్వర సర్వేలో ప్రతి ఒక్కరికీ సంబంధించిన ఆరోగ్య వివరాలను నమోదు చేయాలని, ఎవరికైనా స్వల్ప లక్షణాలు కనిపిస్తే మందులు అందించాలని కలెక్టర్ టి.వినయ్కృష్ణారెడ్డి వైద్య సిబ్బందిని ఆదేశించారు. మండల కేంద్రంలో జరుగుతున్న జ్వర సర్వేను మంగళవారం ఆయన పరిశీలించారు. సర్వే వివరాలను వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో కరోనా బారిన పడిన వ్యక్తి ఇంటి వద్దకు వెళ్లి అతని ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. వైద్య సిబ్బందితో ఆక్సిజన్ లెవల్స్ చెక్ చేయించారు. అనంతరం మండలంలో లాక్డౌన్ అమలు తీరును తాసీల్దార్ జె.కార్తీక్ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తూ కరోనా కట్టడిలో భాగస్వాములు కావాలన్నారు. తప్పనిసరి పరిస్థితి అయితేనే ఉదయం ఆరు నుంచి పది గంటల వరకు బయటకు రావాలని, మాస్క్ ధరించడంతోపాటు భౌతిక దూరం పాటించాలని సూచించారు. కార్యక్రమంలో తాసీల్దార్ కార్తీక్, ఎంపీఓ లావణ్య, గిర్దావర్ తబ్రేజ్, గరిడేపల్లి సర్పంచ్ సీతారాంరెడ్డి, పంచాయతీ కార్యదర్శి భద్రయ్య, ఏఎన్ఎం కవిత, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
లక్షణాలు కనిపిస్తే హోం ఐసొలేషన్లో
పెన్పహాడ్ : కరోనా బారిన పడినవారు విధిగా హోం ఐసొలేషన్కు వెళ్లాలని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి సూచించారు. మండల కేంద్రంలో నిర్వహిస్తున్న జ్వర సర్వేను తనిఖీ చేసి మాట్లాడారు. లాక్డౌన్కు ప్రజలంతా సహకరించాలని, అనవసరంగా బయటకు రావద్దని సూచించారు. ప్రజలంతా భౌతిక దూరం పాటించాలని, మాస్క్లు తప్పకుండా ధరించాలని సూచించారు. కార్యక్రమంలో తాసీల్దార్ శేషగిరిరావు, ఎంపీడీఓ బాణాల శ్రీనివాస్, వైద్యాధికారి ప్రదీప్తకుమార్, ఎంపీఓ ఆంజనేయులు, ఆశ వర్కర్లు, అంగన్వాడీలు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
పరిశుభ్రతతో మెరుగైన ఆరోగ్యం : ఏంపీడీఓ
చివ్వెంల : పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని ఏంపీడీఓ కె.జమలారెడ్డి అన్నారు. మండలంలోని బండమీది చందుపట్లలో మంగళవారం ఆయన పర్యటించి మాట్లాడారు. కరోనా సోకకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతిఒక్కరూ డబుల్ మాస్కులు ధరించడంతోపాటు భౌతిక దూరం కచ్చితంగా పాటించాలని సూచించారు. జ్వర సర్వేకు ప్రజలందరూ సహకారం అందించాలని కోరారు. సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పారిశుధ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. కొవిడ్ లక్షణాలు ఉన్నవారికి మెడికల్ కిట్లు అందించారు. కార్యక్రమంలో సర్పంచ్ బోయిళ్ల కృష్ణ, పంచాయతీ కార్యదర్శి చలమయ్య పాల్గొన్నారు.
వదంతులు నమ్మొద్దు
హుజూర్నగర్ రూరల్ మండలంలోని గోపాలపురంలో 200 కరోనా కేసులు ఉన్నాయని వస్తున్న వార్తలు అవాస్తవమని, వదంతులను ప్రజలు నమ్మొద్దని సర్పంచ్ శాసనాల నాగసైదయ్య అన్నారు. వైద్య సిబ్బంది మంగళవారం చేపట్టిన సర్వేను ఆయన పరిశీలించారు. ఇప్పటి వరకు 115 ఇండ్లను సర్వే చేయగా ముగ్గురికి కొవిడ్ లక్షణాలు ఉన్నాయని, వారికి మందులు అందించినట్లు సర్పంచ్ తెలిపారు. గ్రామంలో 15కేసుల కన్నా ఎక్కువ లేవని, వారు కూడా కోలుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ రాజారావు, ఝాన్సీ, ఆశ వర్కర్లు యశోద, విజయ పాల్గొన్నారు.