హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 1: కేంద్ర బడ్జెట్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు మొండిచేయి చూపడంపై మంగళవారం హనుమకొండ చౌరస్తాలో టీఆర్ఎస్ శ్రేణులు ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. మోదీ డౌన్డౌన్ అంటూ నినదించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కాజీపేటలో రైల్వే కోచ్ఫ్యాక్టరీ, ఉమ్మడి వరంగల్ జిల్లాకు నిధులు కేటాయించకపోవడంపై టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మండిపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని విభజన చట్టం హామీలను కేంద్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహ్మద్ అజీజ్ఖాన్, కార్పొరేటర్ వేముల శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ తాడిశెట్టి విద్యాసాగర్, టీఆర్ఎస్ నాయకులు నలుబోలు సతీశ్, చీకటి ఆనంద్, నయీమొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.