న్యూస్నెట్వర్క్/హైదరాబాద్, నవంబర్ 19(నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఉద్దేశించి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై శనివారం టీఆర్ఎస్ శ్రేణులతోపాటు వివిధ దళితసంఘాలు మండిపడ్డాయి. పలుచోట్ల నిరసన ప్రదర్శనలు, దిష్టిబొమ్మల దహనం వంటి కార్యక్రమాలు చేపట్టాయి. అర్వింద్ వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. జగిత్యాల జిల్లా బీర్పూర్, రాయికల్, జమ్మికుంట హుజూరాబాద్ తదితర ప్రాంతాల్లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు నిర్వహించి, అర్వింద్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
మల్లాపూర్ మండలం కుస్తాపూర్లో తెలంగాణ జాగృతి యూత్ కార్యకర్తలు, కరీంనగర్ జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ మహిళా నేతలు అర్వింద్ దిష్టిబొమ్మను దహనం చేశారు. హైదరాబాద్ లోయర్ ట్యాంక్బండ్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద పలు దళిత సంఘాల నేతలు ఆందోళన నిర్వహించారు. కార్యక్రమంలో తెలంగాణ మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కొక్కెర భూమన్న, మాదిగ హక్కుల దండోరా వ్యవస్థాపక అధ్యక్షుడు జన్ను కనకరాజు, తెలంగాణ మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షుడు మర్మాముల మల్లేశ్, ఉపాధ్యక్షుడు కృష్ణమూర్తి, మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్, వడ్డెర కార్మిక ఐక్య సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ, అఖిల భారత అంబేద్కర్ సంఘం రాష్ట్ర నాయకుడు ప్రభాకర్, దళిత సంఘాల నేతలు జమాల్పురం బాలనరసింహ తదితరులు పాల్గొన్నారు.
మహిళా కమిషన్కు ఫిర్యాదు
ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీ అర్వింద్పై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ మహిళా విభాగం నాయకులు రాష్ట్ర మహిళా కమిషన్తోపాటు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం మహిళా కమిషన్ చైర్పర్సన్ సునితా లక్ష్మారెడ్డిని కలిసి ఫిర్యాదు చేసినవారిలో టీఆర్ఎస్ మహిళా నాయకులు ముక్తవరం సుశీలారెడ్డి, లీల, సువర్ణారెడ్డి, గీతాగౌడ్, ఉమావతి, ప్రభారెడ్డి, సుజాతాగౌడ్, ప్రీతిరెడ్డి, పద్మ తదితరులు ఉన్నారు. సిటీ సివిల్ కోర్టు గతంలో జారీ చేసిన ఆదేశాలను ధికరించి అసభ్యంగా, అభ్యంతరకరంగా, అవమానించే రీతిలో అర్వింద్ మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు.