హైదరాబాద్, డిసెంబర్ 18(నమస్తే తెలంగాణ): రీజినల్ రింగురోడ్డు నిర్మాణంలో అడ్డంగా వచ్చే కరెంటు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, టెలికం లైన్లు వంటి (యుటిలిటీస్)ను తొలగించేందుకు అయ్యే ఖర్చును రాష్ట్రమే భరించాలని కేంద్రం స్పష్టం చేసింది. ఇటీవల రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన విజ్ఞప్తిని కేంద్రం తిరస్కరించింది. భూసేకరణకు అయ్యే ఖర్చుతోపాటు యుటిలిటీస్ షిఫ్టింగ్కు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖ అధికారులు స్పష్టంచేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు, ఇక్కడి రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకొని కేసీఆర్ ప్రభుత్వం ప్రతిపాదించిన రీజినల్ రింగురోడ్డుకు కేంద్ర భారత్మాల పరియోజన ఫేజ్-1 కింద ఆమోదం తెలిపింది. సంగారెడ్డి, తూప్రాన్, చౌటుప్పల్, ఆమన్గల్, శంకర్పల్లి తదితర పట్టణాలగుండా 340 కిలోమీటర్ల పొడవున నాలుగు లేన్లతో దీనిని ప్రతిపాదించారు.
భూసేకరణకు సుమారు రూ.5,170 కోట్లకుపైగా ఖర్చవుతుందని అంచనా వేయ గా, ఇందులో సగం రూ.2,585 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది. ఈ మేరకు కేసీఆర్ ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించి, అందులో రూ.100 కోట్లు ఇప్పటికే విడుదల చేసింది. యుటిలిటీస్ షిఫ్టింగ్కు రూ. 363 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. రోడ్డు నిర్మాణం జరిగిన తరువాత టోల్ట్యాక్స్, పెట్రోల్ సెస్సు రూపంలో కేంద్రం వసూలు చేసుకుంటుంది కాబట్టి యుటిలిటీ షిఫ్టింగ్ భారాన్ని కూడా భరించాలని కేసీఆర్ ప్రభుత్వం కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తిచేసింది. కానీ కేంద్రం స్పందించలేదు.
రాష్ట్రంపై రూ.363 కోట్ల భారం
రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ సర్కారు కొలువుదీరిన తరువాత ఆర్అండ్బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీలో కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిని గడ్కరీని కలిసి ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరలో పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. పనిలోపనిగా యుటిలిటీస్ తరలింపునకు అయ్యే ఖర్చును కూడా కేంద్రం భరించాలని కోరగా, కేంద్రం మరోమారు తిరస్కరించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ. 363 కోట్ల భారం తప్పే అవకాశం లేదు.