హైదరాబాద్, మార్చి 25, (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఎక్సైజ్ కోర్టు మెజిస్ట్రేట్ ఏ మణికంఠ భౌతికకాయానికి తెలంగాణ న్యాయమూర్తుల సంఘం నేతలు, పలువురు న్యాయమూర్తులు సోమవారం అంబర్పేటలోని ఆయన నివాసంలో నివాళులర్పించారు. అతిపిన్న వయసులో 2016లో న్యాయమూర్తిగా ఎంపికైన మణికంఠ గతంలో ఆలేరులో పనిచేశారు. హైదరాబాద్లో విధులు నిర్వర్తిస్తున్న ఆయన ఆదివారం తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. సౌమ్యుడిగా, వివాద రహితుడిగా ఆయనకు మంచి పేరుందని జడ్జీలు, న్యాయవాదులు పేర్కొన్నారు.
సంఘం ప్రతినిధులు మణికంఠ తల్లిదండ్రులను పరామర్శించి, సానుభూతి తెలిపారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. నివాళులర్పించిన వారిలో సంఘం మాజీ అధ్యక్షుడు, హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ సంతోష్ రెడ్డి , తెలంగాణ రాష్ట్ర న్యాయమూర్తుల సంఘం అధ్యక్షుడు ప్రభాకర్ రావు ప్రధాన కార్యదర్శి కే మురళీమోహన్ , న్యాయమూర్తుల హౌజింగ్ సొసైటీ ప్రధాన కార్యదర్శి జీవన్ కుమార్, సంఘ సహాయ కార్యదర్శి కే దశరధరామయ్య, కార్యవర్గ సభ్యులు మండా వెంకటేశ్వరరావు, ఎం రాజు , సంపత్, ఫరాన్ కౌసర్ మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి ప్రేమావతి, జొనైల్ జస్టిస్ కోర్టు న్యాయమూర్తి రాధిక తదితరులు ఉన్నారు.