దేశంలోనే తొలిసారిగా గురుకులం ఏర్పాటు
ఏటా 60 మందికి విద్యాబోధన
గిరిజన విద్యార్థులకే 39 సీట్లు
నేడు ప్రారంభించనున్న మంత్రులు సత్యవతి రాథోడ్, హరీశ్రావు
సంగారెడ్డి, మార్చి 26: దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం గిరిజనుల కోసం రెసిడెన్షియల్ విధానంలో న్యాయ కళాశాలను ఏర్పాటు చేసింది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కళాశాలలో గిరిజన విద్యార్థులతోపాటు ఇతరులకు ఉచితంగా విద్యాబోధన చేయనున్నది. మొత్తం 60 సీట్లలో గిరిజన విద్యార్థులకు 39 సీట్లను కేటాయించారు. దళితులకు ఆరు, బీసీలకు 7, ఓసీలకు 2, ఎన్సీసీ క్యాటగిరీకి 2, స్పోర్ట్స్ కోటాలో 2, దివ్యాంగులకు ఒకటి, మాజీ సైనిక కుటుంబాలకు ఒక సీటు చొప్పున మొత్తం 60 మందికి కోర్సులో ప్రవేశం కల్పిస్తారు. ఇప్పటికే లాసెట్ ఆధారంగా సీట్ల ను భర్తీ చేయగా.. 36 మంది విద్యార్థులు చేరారు. మరో విడుతలో మిగతా సీట్లను భర్తీ చేయనున్నారు.
ఓయూకు అనుబంధంగా..
గురుకుల న్యాయ కళాశాలలో పాఠ్యాంశాల బోధనకు ఒక డైరెక్టర్ సహా ఐదుగురు అధ్యాపకులతో ఓ బృందా న్ని ప్రభుత్వం నియమించింది. ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా ఐదేండ్లపాటు ఇంటిగ్రేటెడ్ కోర్సు ను అందిస్తున్నది. విజయవంతంగా కోర్సు పూర్తిచేసిన వారికి బీఏ, ఎల్ఎల్బీ న్యాయశాస్త్ర పట్టాను అందించనున్నది. ఈ కళాశాలకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతి ఉన్నది. కళాశాలలో హాస్టల్ వసతి, వంటశాల, జిమ్, గ్రంథాలయం వంటి సౌకర్యాలు కల్పించింది.
గిరిజన కుటుంబాల్లో సంతోషం
ప్రభుత్వ ఆధ్వర్యంలో రెసిడెన్సియల్ న్యాయ విద్య అందుబాటులోకి రావడంతో గిరిజనులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో బతుకు వెళ్లదీస్తున్న తమ బిడ్డలకు ఉన్నత విద్య ఉచితంగా అందనుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు సంబురపడుతున్నారు.
నేడు ప్రారంభించనున్న మంత్రులు
సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని 16వ వార్డులో (పాత నాగార్జున డిగ్రీ కళాశాల) ప్రైవేట్ భవనంలో ఏర్పాటుచేసిన ఈ కళాశాలను శనివారం రాష్ట్ర గిరిజనశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రారంభించనున్నారు. కళాశాల ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చేశామని కళాశాల డైరెక్టర్ డాక్టర్ వీవీ కన్నా తెలిపారు.