నిజామాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): చావు అంచులకు వెళ్లిన మనిషికి మళ్లీ ప్రాణం పోసినట్టు.. నిజామాబాద్ జిల్లాలో కొట్టేసిన భారీ వృక్షాలకు అటవీశాఖ అధికారులు పునర్జన్మ ప్రసాదిస్తున్నారు. రోడ్ల విస్తరణ, ఇతర అభివృద్ధి కార్యకలాపాలకోసం కొట్టేస్తున్న 50 ఏండ్లకుపైగా వయసున్న చెట్లను ట్రాన్స్లొకేషన్ పద్ధతిలో మరోచోట నాటుతూ బతికిస్తున్నారు. జాతీయ రహదారి 161 విస్తరణలో వందల వట వృక్షాలను నేలకొరిగే ప్రమా దం నుంచి కాపాడారు.
కష్టమైన పనే..
ట్రాన్స్ లొకేషన్లో నాటే వృక్షాలను బతికించే పనిని పిట్లం రేంజ్ అటవీశాఖ అధికారులు సవాల్గా తీసుకొన్నారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సంజయ్ గౌడ్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ సిద్ధార్థ దశాబ్దాల వయసున్న చెట్లకు తిరిగి ప్రాణం పోశారు. జాతీయ రహదారి పక్కన ఉన్న నెమలి నార, ఇప్ప, మర్రి, చెన్నంగి, నర్లింగ, వేప, సోమి వంటి భిన్నమైన 12 రకాల చెట్లను ట్రాన్స్లొకేషన్ చేశారు. పిట్లం రేంజ్లో 46 వృక్షాల్లో 33 చెట్లు తిరిగి నాటుకున్నాయి. ట్రాన్స్లొకేషన్లో 50 శాతానికి కంటే ఎక్కువ నాటుకున్నాయి. 2 మీటర్ల లోతులో నాటిన వృక్షాలకు నిరంతరం నీళ్లు పోయడం, వర్మి కంపోస్టింగ్, ఫర్టిలైజింగ్ అప్లికేషన్, ఐబీఏ హార్మోన్ అప్లికేషన్ వంటి ప్రక్రియలతో అటవీ సిబ్బంది కంటికి రెప్పలా కాపాడుతున్నారు. 2020 జనవరిలో చేపట్టిన ట్రాన్స్ లొకేషన్ విధానం 22 నెలల తర్వాత అద్భుత ఫలితాలు ఇస్తున్నది. బాన్సువాడ, పిట్లం, జుక్కల్ రేంజ్ పరిధిలో భారీ చెట్లను నాటడంతో ఖాళీ ఏర్పడిన అటవీ భూభాగం ఇప్పుడు కొంత వరకు పచ్చదనంతో దర్శనమిస్తున్నది.
పైకస్ జాతుల చెట్లకు సక్సెస్ రేటు ఎక్కువ
రోడ్డు విస్తరణలో నేలకొరిగే పరిస్థితి ఉన్న 50 ఏండ్లు పైబడిన వృక్షాలను ఎలాగైనా బతికించాలని ప్రయత్నించాం. ఏడాదిన్నర కష్టానికి తగిన ఫలితం దక్కింది. పైకస్ జాతులకు చెందిన రావి, మర్రి వృక్షాలను తిరిగి నాటడం ద్వారా 100 శాతం సక్సెస్ రేటు సాధించాం. మిగిలిన వృక్షాల్లోనూ ఆశించిన స్థాయిలో ప్రగతి కనిపించింది. – సంజయ్ గౌడ్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్
చాలా జాగ్రత్తలు తీసుకున్నాం
మనిషి ప్రాణాలను కాపాడే చెట్లను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నది. అందులో భాగంగానే రోడ్డు విస్తరణలో తొలగించిన చెట్లను చాలా జాగ్రత్తగా కాపాడుకున్నాం. ట్రాన్స్లొకేషన్ విధానంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉన్నతాధికారుల సపోర్టుతో చెట్లకు ప్రాణం పోశాం. మా కష్టానికి తగిన ఫలితం వచ్చింది. –సిద్ధార్థ, డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్