హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): కొత్త జోనల్ విధానం ప్రకారం ఉద్యోగులను వివిధ జిల్లాలకు సర్దుబాటు చేసే ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానున్నది. ఉద్యోగులు తాము కోరుకున్న జిల్లాకు వెళ్లేందుకు ఆప్షన్లు పెట్టుకోనున్నారు. వారంపాటు ఆప్షన్లు ఎంచుకొనేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఇందుకోసం ప్రత్యేక ప్రొఫార్మాను రూపొందించినట్టు అధికారవర్గాలు తెలిపాయి. ఉద్యోగులు తమ వివరాలన్నీ నింపి ఆ పత్రాలను ఉమ్మడి జిల్లాల కలెక్టరేట్లలో అందజేయాల్సి ఉంటుంది. వాటి ఆధారంగా ఈ నెల 31లోగా ఉద్యోగుల బదిలీ ప్రక్రియ పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాలవారీగా శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగులను కేటాయించే ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఉమ్మడి జిల్లా కేంద్రం కలెక్టర్లను నోడల్ అధికారులుగా నియమించింది. వీరు ఉమ్మడి జిల్లా పరిధిలో మిగిలిన జిల్లాల కలెక్టర్లతో సమన్వయం చేసుకొని ఉద్యోగులు, పోస్టుల కేటాయింపు పూర్తిచేస్తారు.
తేలనున్న క్యాడర్ స్ట్రెంత్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిపాలనా సౌలభ్యం కోసం 10 జిల్లాలను పునర్వ్యవస్థీకరించి 33 జిల్లాలు చేశారు. 2016 అక్టోబర్లో దసరా రోజున 31 కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. అనంతరం ప్రజల డిమాండ్ మేరకు 2019 ఫిబ్రవరిలో ములుగు, నారాయణపేట జిల్లాలను ఏర్పాటుచేశారు. ప్రస్తుతం కొన్ని జిల్లాల్లో 9 మండలాలుంటే, మరికొన్నింటిలో 30కి పైగా ఉన్నాయి. జిల్లాలు ఏర్పాటైన రోజునే ఉద్యోగులను వర్క్ టు ఆర్డర్ కింద కొత్త జిల్లాలకు పంపించారు. అప్పటి నుంచి ఉద్యోగులంతా వర్క్ టు ఆర్డర్ కిందే పని చేస్తుండటంతో జిల్లాల్లో క్యాడర్ స్ట్రెంత్ ఎంతనేది నిర్ధారణ కాలేదు. ప్రస్తుతం కొత్త జోనల్ వ్యవస్థ అమల్లోకి రావడంతో కొత్త జిల్లాలకు పోస్టులు, ఉద్యోగులను కేటాయించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ ప్రక్రియ పూర్తయితే ఏ జిల్లాలో ఎంతమంది ఉద్యోగులున్నారనే విషయం తేలుతుంది. పోస్టులు, ఉద్యోగుల కేటాయింపుల్లో జనాభాను ప్రాతిపదికగా తీసుకోనున్నారు. ఎక్కువ జనాభా ఉన్న జిల్లాల్లో ఎక్కువ పోస్టులు, శాఖలు కేటాయించే అవకాశం ఉన్నది. పాత జిల్లా కేంద్రాల్లో ఎక్కువ కార్యాలయాలు ఉన్నాయి. పోస్టుల కేటాయింపుల్లో దీనిని కూడా ప్రాతిపదికగా తీసుకోనున్నారు.
జిల్లాస్థాయి ఉద్యోగులకు మూడురోజులు గడువు
రాష్ట్ర విభజన సమయంలో ఉద్యోగులు ఏ రాష్ట్రంలో ఉండాలనుకొంటున్నారో నిర్ణయించుకొనేందుకు ఆప్షన్లు కోరారు. ఇప్పుడు ఆదే విధానంలో ఏ జిల్లాలో పనిచేయాలనుకొంటున్నారనేది నిర్ణయించుకొనేందుకు ఉద్యోగులు ఆప్షన్లు పెట్టుకోవాల్సి ఉంటుంది. కొత్త జోనల్ విధానంలో జిల్లా, జోనల్, మల్టీ జోనల్తో మూడంచెల వ్యవస్థ ఏర్పడింది. ఆప్షన్లు ఇవ్వడానికి జిల్లాస్థాయి ఉద్యోగులకు వారం, జోనల్, మల్టీజోనల్ ఉద్యోగులు, అధికారులకు మూడు రోజులు గడువు ఇచ్చారు. ఆప్షన్లన్లు నోడల్ జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ఉమ్మడి జిల్లా పరిధిలో ఏర్పడిన నూతన జిల్లాల కలెక్టర్లు, ఆయాశాఖల జిల్లాస్థాయి అధికారులు పరిశీలించి కేటాయింపులు చేస్తారు. జోనల్, మల్టీ జోనల్ పరిధిలోని అధికారులు, పోస్టులను ఆయా శాఖాధిపతులు పరిశీలిస్తారు. ఉద్యోగుల కేటాయింపుల్లో దివ్యాంగులు, వితంతువులు, భార్యాభర్తలకు ప్రాధాన్యం ఇస్తారు. ఆ తరువాతే మిగతావారికి సీనియారిటీ, స్థానికత, విద్యార్హతల ఆధారంగా అవకాశం ఇస్తారు.