హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): అమెరికా 2040 నాటికి నెట్జీరో స్థాయికి చేరడమే లక్ష్యమని ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు పేర్కొన్నారు. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్ డీసీలో వారం రోజులపాటు జరిగిన సదస్సుకు తెలంగాణ తరఫున ఆయన హాజరయ్యారు. కర్బన ఉద్గారాల కారణంగా భూతాపం పెరుగుతుండడంపై సదస్సులో ఆందోళన వ్యక్తమైనట్టు తెలిపారు. వందశాతం కార్బన్ ఫ్రీ విద్యుత్తును వినియోగిస్తే దానిని ‘నెట్జీరో’గా పిలుస్తారని వివరించారు. పునరుత్పాదకశక్తిపై ప్రభుత్వానికి సలహాలు, సూచనలు అందిస్తూ పర్యావరణ పరిక్షణలో కీలకపాత్ర పోషించే అమెరికాలోని నేచురల్ రిసోర్సెస్ డిఫెన్స్ కౌన్సిల్ (ఎన్ఆర్డీసీ) ఆధ్వర్యంలో ఈనెల మొదటి వారంలో ఐదు రోజులపాటు శాన్ఫ్రాన్సిస్కోలో, మూడు రోజులపాటు వాషింగ్టన్ డీసీలో అంతర్జాతీయ కార్బన్ ఫ్రీ పవర్పై సదస్సు నిర్వహించారు.
ఇందులో చర్చించిన అంశాలను ‘నమస్తే’తో ప్రభాకర్రావు పంచుకున్నారు. అమెరికా ప్రభుత్వం నెట్జీరో ఎనర్జీపై స్పష్టమైన అవగాహనతో ఉన్నదని, 2030 నాటికి 75శాతం, 2040 నాటికి 100 శాతం కార్బన్ ఫ్రీ ఎనర్జీతో నెట్జీరో స్థాయికి చేరుకోవాలన్న లక్ష్యంతో ఉన్నట్టు తెలిపారు. నెట్జీరో ఎనర్జీ దిశగా పాలసీ రూపొందించాలని ఎన్ఆర్డీసీ సూచించినట్టు వివరించారు. గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో నిర్దిష్ట కాలపరిమితితో పాలసీలు అమలు చేసేలా ప్రణాళికలు రూపొందించాలని భారత ప్రతినిధుల బృందం సూచించినట్టు పేర్కొన్నారు. కార్బన్ ఫ్రీ ఎనర్జీ కోసం పునరుత్పాదక విద్యుత్తు 24 గంటలూ అందుబాటులో ఉండేలా స్టోర్ చేసుకోవడం వంటి అంశాలపై లోతుగా చర్చలు జరిగినట్టు పేర్కొన్నారు. ఒక రోజు మొత్తం ప్రశ్నలు, జవాబులకు కేటాయించినట్టు తెలిపారు. రెన్యువబుల్ ఎనర్జీ సంస్థలు, ప్లాంట్ను పరిశీలించినట్టు ప్రభాకర్రావు వివరించారు.