ఇల్లందకుంట, జూలై 28: దళితులపై ఈటల కుటుంబానికి ఉన్న అభి ప్రాయం, వాట్సాప్ చాట్తో బయటపడిందని.. దళిత ద్రోహి ఈటలను నిలదీయాలని టీఎస్ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య, రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ పిలుపునిచ్చారు. దళితు లను అవమానించిన ఈటల కుటుంబసభ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రా సిటీ కేసు పెట్టాలని డిమాండ్చేశారు. ఈటల చేస్తున్నది పాదయాత్రనా, దండ యాత్రనా అని నిలదీశారు. బుధవారం కరీంనగర్ జిల్లా ఇల్లందకుంటలో జిల్లా అధ్యక్షుడు కొడెపాక సారంగపాణి అధ్యక్షతన జరిగిన హుజూరాబాద్ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. ఈటల దళితులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేకుంటే ఎక్కడి కక్కడ నిలదీస్తామని హెచ్చరించారు. దళితబంధు పథకం ఎంతో బాగుందని, దీన్ని తాము స్వాగతిస్తున్నామని తెలిపారు. మాదిగ, మాదిగ ఉప కులాలు టీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు. ప్రపంచంలో ఎవరూ చేయలేని విధంగా సీఎం కేసీఆర్ సంక్షేమ ఫలాలను అందిస్తున్నారని కొనియాడారు. అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అందించాలన్నారు.