హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ స్టేట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కానిస్టేబుళ్ల శిక్షణ ఈ నెల 4 నుంచి ప్రారంభం కానున్నది. హైదరాబాద్ అప్పా జంక్షన్ వద్దనున్న ఎక్సైజ్ ట్రైనింగ్ అకాడమీలో ఈ శిక్షణ ఏర్పాట్లు చేసినట్టు ఆ శాఖ ఉన్నతాధికారులు మంగళవారం వెల్లడించారు. మొదటి బ్యాచ్లో 120 మంది ట్రైనీలకు శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. మిగిలిన వారిని ఫీల్డ్ ట్రైనింగ్కు పంపనున్నారు. అయితే మొదటిబ్యాచ్లో శిక్షణ ఇచ్చే 120 మంది అభ్యర్థులకు ఇప్పటికే సమాచారం ఇవ్వగా.. వారు ట్రైనింగ్ అకాడమిలో రిపోర్టు చేసినట్టు తెలిసింది.
ప్రస్తుతం శిక్షణకు 475 మంది కానిస్టేబుళ్లు సంసిద్ధంగా ఉన్నట్టు ఎక్సైజ్ ఉన్నతాధికారులకు సమాచారం అందింది. కాగా శిక్షణకు రిపోర్టు చేసేందుకు ఈనెల 13 వరకు అవకాశం ఉండటంతో.. ఎక్కువ మంది అభ్యర్థులు శిక్షణకు వస్తారని అధికారులు భావిస్తున్నారు. రెండు నెలలుగా పెండింగ్లో ఉన్న ఎక్సైజ్ కానిస్టేబుళ్ల శిక్షణకు ఇటీవలే సీఎం రేవంత్రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘400 మందితో సర్కారు చెలగాటం’ పేరిట ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక రాసిన కథనానికి ఆయన స్పందించారు. ఇన్నాళ్లూ శిక్షణ ఇచ్చేందుకు అకాడమీని సిద్ధం చేయలేక సాకులు చెప్పిన కొందరు అధికారులు ఇప్పుడు చకచకా కార్యాచరణ మొదలుపెట్టారు.