హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 12 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో సైబర్క్రైం పోలీసుల విచారణకు టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి గురువారం హాజరుకాలేదు. 19న విచారణకు హాజరవుతానని ఆయన పోలీసులను కోరారు. వార్ రూమ్ నుంచి ప్రధాని, సీఎం, మంత్రులు, వివిధ పార్టీల నాయకుల మార్ఫింగ్ ఫొటోలతో వీడియోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఈ నేపథ్యంలో సైబర్క్రైం పోలీసులు కేసు నమోదు చేసి, కాంగ్రెస్ వ్యూహకర్తగా ఉన్న సునీల్ కనుగోలుతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే తానే వార్ రూమ్ ఇన్చార్జినని మల్లు రవి పోలీసులకు లేఖ రాశారు.
సునీల్ కూడా మల్లు రవి పేరు చెప్పడంతో గురువారం విచారణకు హాజరు కావాలని పోలీసులు మల్లు రవికి నోటీసులు ఇచ్చారు. అయితే, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావు ఠాక్రే బాధ్యతలు తీసుకొన్నాక హైదరాబాద్ వచ్చారని, అందుకే తాను విచారణకు హాజరుకాలేకపోతున్నానని పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంక్రాంతి తర్వాత హాజరవుతానని తెలియజేయడంతో 19న హాజరుకావాలని సైబర్ క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్ సూచించారు.