తిరుమలగిరి, మే 18: హనుమాన్ భక్తుల టూరిస్టు బస్సు డ్రైవర్కు గుండెపోటు వచ్చింది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును పక్కకు నిలిపాడు. ఆ వెంటనే ప్రాణాలు వదిలాడు. విషాదకరమైన ఈ ఘటన సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలో గురువారం జరిగింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 14న 25 మంది హనుమాన్ భక్తులతో వైజాగ్ నుంచి భద్రాచలం మీదుగా యాదగిరిగుట్టకు టూరిస్టు బస్సు బయల్దేరింది. గురువారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తొండ గ్రామం వద్దకు రాగానే బస్సు డ్రైవర్ చిట్టిబాబుకు ఛాతిలో నొప్పి వచ్చింది.
అప్రమత్తమైన ఆయన బస్సును పక్కకు ఆపి క్యాబిన్లోనే ప్రాణాలు వదిలాడు. బస్సులో ఉన్న ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ఏరియా దవాఖానకు తరలించారు.