కరీంనగర్ : మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణంతో జిల్లా పర్యాటకంగా ఎంతో అభివృద్ధి సాధిస్తుంది. మానేరు రివర్ ఫ్రంట్ జిల్లాకే మణిహారంగా మారుతుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మానేరు రివర్ ఫ్రంట్లో ఫౌంటెన్లు ఏర్పాటు చేసేందుకు నీటిపారుదల శాఖ, టూరిజం శాఖ అధికారులు, కన్సల్టెన్సీ ప్రతినిధులతో మంత్రి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మల్టీమీడియా కన్సల్టెంట్ ప్రతినిధి నరేంద్ర నాయుడు మానేరు రివర్ ఫ్రంట్ లో ఏర్పాటు చేయుటకు మ్యూజికల్ ఫౌంటెన్, లేజర్ లైట్,ఫ్లోటింగ్ మ్యూజికల్ ఫౌంటెన్, లైటింగ్ అరౌండ్ వాటర్, ఇంటరాక్టివ్ గ్లోయింగ్ నైట్ గార్డెన్, వాటర్ క్లాక్ , వాటర్ ఫాల్ స్వింగ్, స్కల్ప్చర్ ఫౌంటెన్, థీమ్ పార్క్, వాటర్ డాన్స్ నైట్ విత్ లైట్, వాటర్ స్పోర్ట్స్ నైట్ విత్ లైటింగ్, తదితర ఫౌంటెన్ ల పనితీరును పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. ఫౌంటైన్లు డిజైన్ చేసి, సందర్శకులకు ఆహ్లాదం కలిగించేలా ఏర్పాటు చేసేందుకు కొటేషన్ లు ఇవ్వాలని మల్టీ మీడియా కన్సల్టెన్సీ ప్రతినిధులకు సూచించారు. మానేరు రివర్ ఫ్రంట్ కు రెండువైపులా సందర్శకులు కూర్చునేందుకు అద్భుతమైన పార్కులను ఏర్పాటు చేయాలని, సందర్శకులు కూర్చొని వీక్షించే లా లైటింగ్ తో కూడిన ఫౌంటైన్లను ఏర్పాటు చేయాలన్నారు.
సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, పర్యాటక శాఖ ఎండీ మనోహర్,ఈడీ శంకర్ రెడ్డి, ఇరిగేషన్ ఎస్ ఈ శివ కుమార్, ఈఈ నాగభూషణరావు, కన్సల్టెన్సీ ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.