హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన దళితబంధు అమలుకు కావలసిన ఆర్థికవనరులను రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా సమకూర్చింది. ఈ పథకం కోసం ఇప్పటివరకు రూ.1500 కోట్లు విడుదలచేసిన ప్రభుత్వం గురువారం మరో రూ.500 కోట్లు విడుదలచేసింది. దీంతో నియోజకవర్గంలోని 20 వేల కుటుంబాలకు పంపిణీ చేయాల్సిన రెండువేల కోట్లు కరీంనగర్ కలెక్టర్ దళితబంధు ఖాతాకు జమ అయ్యాయి. 17 రోజుల్లోనే అక్షరాలా రెండువేల కోట్ల రూపాయలు విడుదలయ్యాయి. గురువారం వారు కోరుకొన్న యూనిట్ల అందజేత కూడా మొదలైంది. 15 వేల కుటుంబాలకు యూనిట్ల పంపిణీకి ఏర్పాట్లూ పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి రాహుల్ బొజ్జా కరీంనగర్లోనే మకాంవేసి అధికారులకు దళితబంధు పథకంపై అవగాహన కల్పిస్తున్నారు.