యాదాద్రి, నవంబర్ 16 : ఒమన్ దేశ రాజధాని మస్కట్లో శుక్రవారం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. ఏటా మస్కట్ లక్ష్మీనరసింహస్వామి భక్త బృందం ఆధ్వర్యం లో ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. యాదగిరిగుట్ట నుంచి ఆలయ ప్రధానార్చకులు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, అర్చకులు మంగళగిరి నరసింహమూర్తి, సిద్ధార్థ, ఆలయ సూపరింటెండెంట్ సురేందర్రెడ్డి బుధవారం మస్కట్కు బయలుదేరి వెళ్లారు. 18న ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, ఆరాధన, అర్చనలు, నవకలశ స్థాపన చేపట్టనున్నట్టు ఆలయ ప్రధానార్చకులు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు తెలిపారు. స్వామివారికి అలంకార సేవోత్సవం చేపట్టి ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. అనంతరం స్వామివారి ఆశీర్వచనం, ఆరగింపు, తీర్థ ప్రసాదాల వితరణతో ఉత్సవాలకు ముగింపు పలుకనున్నట్టు తెలిపారు.