కామారెడ్డి, ఫిబ్రవరి 1 : యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేసిన కొద్దిసేపటికే ఓ చిన్నారి మృతి చెందిన ఘటన కామారెడ్డిలో చోటుచేసుకున్నది. చిన్నారి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి మండలం కొటాల్పల్లికి చెందిన అర్చన-రమేశ్ దంపతులు కామారెడ్డిలోని అయ్యప్ప నగర్కాలనీలో నివాసముంటున్నారు. వీరికి బాబు, పాప ఉన్నారు. జనవరి 25న ఇంటి ఎదుట ఆడుకుంటుండగా రెండున్నరేండ్ల క్రితిక్ సారాను కుక్క కరిచింది. కుటుంబ సభ్యులు వెంటనే కామారెడ్డి ప్రభుత్వ దవాఖాన తరలించగా, ఇంజెక్షన్ ఇచ్చారు. ఆదివారం మూడో డోస్ ఇప్పించడానికి చిన్నారిని జీజీహెచ్కు తీసుకొచ్చారు. డోస్ తీసుకోగానే చిన్నారి అపస్మారక స్థితికి చేరగా, వెంటనే ప్రైవేట్ దవాఖానకు తరలించగా అప్పటికే చిన్నారి మృతి చెందింది.
వైద్యుల నిర్లక్ష్యంతోనే చిన్నారి మృతి చెందిందని కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఆందోళనకు దిగారు. దవాఖానలోని ఫర్నిచర్, అద్దాలను ధ్వంసం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అక్కడికి చేరుకొని బాధిత కుటుంబీకులకు నచ్చజెప్పినా వినిపించుకోకుండా సుమారు రెండున్నర గంటలపాటు ఆందోళన చేశారు. చిన్నారి మృతి ఘటనపై విచారణ చేపడుతామని ఆర్ఎంవో సంతోష్ తెలిపారు. ఉదయం 11.30 గంటలకు దవాఖాన నుంచి బయటికి వెళ్లారని, ప్రైవేట్ దవాఖానకు సుమారు 2.30 గంటలకు వెళ్లారని ఈ మధ్యలో ఏమి జరిగిందో విచారణ చేసిన తర్వాత చెప్పగలమని ఆయన పేర్కొన్నారు. రెండు డోస్లు వేసినప్పుడు పాప బాగానే ఉన్నదని, మూడో డోస్ వేసినప్పుడు కూడా బాగానే ఉన్నదని తెలిపారు. విచారణ తరువాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.