హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): దేశ స్వాతంత్య్రం కోసం, స్వయం పాలన కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి బ్రిటిష్ పాలకులతో పోరాడిన అల్లూరి సీతారామరాజు త్యాగం గొప్పదని, స్వాతంత్య్రోద్యమ చరిత్రలో వారి అమరత్వం అజరామరమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమం మంగళవారం హైదరాబాద్లో జరుగుతున్న సందర్భంగా దేశం కోసం వారు చేసిన త్యాగాన్ని సీఎం కేసీఆర్ స్మరించుకొన్నారు. గిరిజనుల హకుల సాధన కోసం నాటి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అల్లూరి ప్రదర్శించిన అసమాన ధైర్యసాహసాలు, పోరాట స్ఫూర్తి చిరస్మరణీయమని చెప్పారు. సీతారామరాజు వంటి వీరుల స్ఫూర్తితో ఎందరో దేశ పౌరులు నాటి స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారని తెలిపారు. భారత రాష్ట్రపతి పాల్గొంటున్న, చారిత్రక సందర్భమైన అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమాన్ని తెలంగాణ గడ్డమీద హైదరాబాద్లో నిర్వహించుకోవడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ప్రజల కోసం పోరాడే త్యాగధనుల జీవితాలు విశ్వజనీనమైన స్ఫూర్తిని పంచుతాయని, వారి త్యాగాలను స్మరించుకొంటూ రేపటి తరాలు ముందుకు సాగాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.