హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): ఇంటర్నేషనల్ దళిత్ మీడియా డే వేడుకలను బేగంపేటలోని టూరిజం ప్లాజాలో మంగళవారం నిర్వహించనున్నట్టు ఇంటర్నేషనల్ దళిత్ జర్నలిస్ట్ నెట్వర్క్ (ఐడీజేఎన్) చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ తన తొలి పత్రిక ‘మూక్నాయక్’ను 1920లో జనవరి 31న ప్రారంభించారని, తరువాత బహిష్కృత్ భారత్, జనతా, ప్రబుద్ధ భారత్ తదితర పత్రికలను కూడా నడిపారని పేర్కొన్నారు.
సమాజాన్ని, అట్టడుగువర్గాలను జాగృతం చేశారని వివరించారు. ఈ చారిత్రక నేపథ్యంలోనే ఐడీజేఎన్ ఈ ఏడాది నుంచి జనవరి 31వ తేదీని ఇంటర్నేషనల్ దళిత్ మీడియా డేగా నిర్వహించాలని నిర్ణయించిందని తెలిపారు. మంగళవారం జరిగే తొలి వేడుకలకు ఐడీజేఎన్ సెక్రటరీ జనరల్ రెమ్ బహదూర్ బీకే, హర్యానా ప్రభుత్వ అడిషనల్ చీఫ్ సెక్రటరీ రాజశేఖర్ ఉండ్రు హాజరు కానుండగా, సీనియర్ ఎడిటర్ కే రామచంద్రమూర్తి, తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తదితరులు ముఖ్యవక్తలుగా పాల్గొంటారని పేర్కొన్నారు.