Bio Asia2023 | లైఫ్సైన్సెస్, ఫార్మా పరిశోధనలపై ప్రపంచం ఇప్పుడు హైదరాబాద్ వైపు చూస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ నిర్విరామ కృషి, ప్రోత్సాహక వాతావరణం ఫలితంగా గ్లోబల్ కంపెనీలు తెలంగాణకు తరలివస్తున్నాయి. స్టార్టప్లను మల్టీనేషనల్ సంస్థలుగా మార్చే ఇంక్యుబేటర్లు, జీనోమ్ వ్యాలీ హైదరాబాద్ సొంతం. ఈ ప్రపంచ వ్యాక్సిన్ల రాజధాని.. నేటినుంచి మూడు రోజులపాటు బయోఏషియా సదస్సు-2023కు వేదిక కానున్నది.
హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న బయో ఏషియా (20వ సదస్సు) సదస్సు శుక్రవారం ప్రారంభం కానున్నది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ)లో ఉదయం 10 గంటలకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్, నోవార్టిస్ సీఈవో వాస్ నరసింహన్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు.
మూడు రోజులపాటు సాగే ఈ సదస్సు సందర్భంగా లైఫ్ సైన్సెస్, ఫార్మా, మెడ్టెక్, ఆరోగ్య సంరక్షణ రంగాలపై నిపుణుల ప్రసంగాలు, బృంద చర్చలు ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల నుంచి 2 వేలకు మందికిపైగా ప్రముఖులు హాజరవుతున్నారు. వ్యాపార భాగస్వామ్యాలు, సాంకేతిక సమావేశాలు, ప్రపంచస్థాయి నిపుణులతో చర్చలు, ఇంటరాక్టివ్ సెషన్స్, సీఈవో కాంక్లేవ్, స్టార్టప్ షోకేస్, బయోపార్క్ సందర్శనలు తదితర కార్యక్రమాలు ఉంటాయి.
రెండురోజులపాటు లైఫ్సైన్సెస్, ఫార్మా, పరిశ్రమ రంగాలకు చెందిన ప్రముఖులతో సమావేశాలు నిర్వహిస్తారు. చివరిరోజు వివిధ కంపెనీలకు చెందిన ప్రదర్శన ఉంటుంది. జీనోమ్ వ్యాలీ ఎక్స్లెన్స్ అవార్డు ప్రదానోత్సవం నిర్వహిస్తారు. భారత్లోని లైఫ్సైన్సెస్, ఫార్మా రంగాన్ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఈ సదస్సు చక్కని వేదికగా ఉపయోగపడుతున్నది. అలాగే, పెట్టుబడుల ఆకర్షణకు కూడా ఇది దోహదపడుతున్నది.
పెట్టుబడులకు దోహదం
తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే లైఫ్సైన్సెస్, ఫార్మా రంగ పర్యావరణ వ్యవస్థకు నిలయంగా ఉన్నది. ఇక్కడ 800కుపైగా ఫార్మా, బయోటెక్ కంపెనీలు ఉన్నాయి. వీటి విలువ 50 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రపంచంలోని మూడింట ఒకవంతు వ్యాక్సిన్ల ఉత్పత్తి మన రాష్ట్రం నుంచే జరుగుతుండగా, దేశీయ ఔషధ ఎగుమతుల్లో 30 శాతం, ఏపీఐ (యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్) ఉత్పత్తిలో 40 శాతం, ఏపీఐ ఎగుమతుల్లో 50 శాతం తెలంగాణ నుంచే జరుగుతున్నది. టాప్-10 ప్రపంచ ఫార్మా కంపెనీల్లో నాలుగు కంపెనీలు మన రాష్ట్రంలో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. హైదరాబాద్లో 20కిపైగా లైఫ్సైన్సెస్, మెడ్టెక్ ఇంక్యుబేటర్లు ఉన్నాయి. దేశంలోని మరే నగరంలో ఇన్ని లేకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో కొత్త పెట్టుబడులను ఆకర్షించేందుకు బయో ఏషియా సదస్సు ఎంతగానో దోహదపడుతుందని చెప్పవచ్చు. అలాగే, 50కిపైగా దేశాలనుంచి ప్రతినిధులు వస్తున్నందున హైదరాబాద్లో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి అవకాశం ఉంటుంది.
పాల్గొననున్న ప్రముఖులు వీరే..
మంత్రి కేటీఆర్తోపాటు కేంద్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం కార్యదర్శి ఎస్ చంద్రశేఖర్, నీతి ఆయోగ్ సభ్యుడు (హెల్త్) వీకే పాల్, నేషనల్ హెల్త్ అథారిటీ అదనపు సీఈవో బసంత్ గార్గ్, కేంద్ర ఔషధ శాఖ కార్యదర్శి ఎస్ అపర్ణ, ప్రపంచ వాణిజ్య వేదిక ఆరోగ్య సంరక్షణ హెడ్ శ్యామ్ బిషెన్, నోవార్టిస్ సీఈవో వాస్ నరసింహన్, నోవార్టిస్ కంట్రీ ప్రెసిడెంట్ అమితాబ్ దూబే ఈ సదస్సులో పాల్గొంటారు.
వీరితోపాటు మోడర్నా సహ వ్యవస్థాపకుడు రాబర్ట్ లాంగర్, సీఈపీఐ సీఈవో రిచర్డ్ హ్యాచెట్, యూఎస్ ఎఫ్డీఏ అసోసియేట్ కమిషనర్ మార్క్ అబ్డో, యూఎస్ ఎఫ్డీఏ డైరెక్టర్ కార్మెల్ రోసా, జీఎస్కే సీనియర్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ అగమ్ ఉపాధ్యాయ్, బ్రిస్టల్ మైర్స్ స్కిబ్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు సమిత్ హీరావత్, ఆపిల్ హెల్త్ ఉపాధ్యక్షురాలు సంబుల్ దేశాయ్, పిరమల్ గ్రూప్ చైర్మన్ అజయ్ పిరమల్, సన్ ఫార్మా ఎండీ దిలీప్ సంఘ్వీ, బయొలాజికల్ ఈ ఎండీ మహిమా దాట్ల, అపోలో దవాఖానల సంయుక్త మేనేజింగ్ డైరెక్టర్ సంగీతారెడ్డి, రెడ్డీస్ ల్యాబొరేటరీస్ చైర్మన్ సతీశ్రెడ్డి తదితరులు పాలుపంచుకొంటారు.