హైదరాబాద్ : తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ను టీఎన్జీవో నేతలు బుధవారం కలిశారు. ఈ సందర్భంగా ఉద్యోగుల జోనల్ విభజనలో పరస్పర బదిలీలకు, భార్యాభర్తల కేసులకు అవకాశం ఇచ్చి బదిలీలు చేపట్టాలని సీఎస్కు టీఎన్జీవో నేతలు విజ్ఞప్తి చేశారు.
317 జీవోను అనుసరించి లోకల్ క్యాడర్ ఉద్యోగుల బదిలీలలో ఉద్యోగులకు పరస్పర బదిలీలకు, భార్యాభర్తల కేసులకు, ఆప్షన్ల ప్రక్రియలో సీనియర్, జూనియర్లకు జరిగిన పొరపాట్లను సవరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరినట్లు టీఎన్జీవో కేంద్ర సంఘ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్ తెలిపారు.
ఉద్యోగులకు మేలు జరిగేలా వారికి మూడు కరువు భత్యం డీఏ బకాయిలను చెల్లించడానికి అనుమతించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు తెలంగాణ ఎన్జీవోల సంఘం కృతజ్ఞతలు తెలిపింది.
ఉద్యోగుల విభజనకు సంబంధించి టీఎన్జీవోలు తమ దృష్టికి తీసుకొచ్చిన విషయాలను సీఎం కేసీఆర్కు నివేదిస్తానని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. స్పౌస్ కేసులు, మ్యూచువల్ కేసులతో పాటు అప్పీల్స్ ను పరిష్కరించడం లాంటి అంశాలలో త్వరలోనే ముఖ్యమంత్రి తెలిపి ఉత్తర్వులు విడుదల చేస్తామని, ప్రధానంగా ఉద్యోగులకు వెసులుబాటు కల్పిస్తామని సీఎస్ హామీ ఇచ్చినట్లు టీఎన్జీవో నేతలు తెలిపారు.
ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ను కలిసిన వారిలో టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్, హైదరాబాద్ అధ్యక్షుడు ముజీబ్, నల్లగొండ జిల్లా అధ్యక్షుడు శ్రవణ్ కుమార్, కోశాధికారి రామినేని శ్రీనివాసరావు, తదితరులు ఉన్నారు.