హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ) : వేతన సవరణలో భాగంగా 51శాతం ఫిట్మెంట్తో నూతన పీఆర్సీని ప్రకటించాలని టీఎన్జీవో కేంద్రం సంఘం కోరింది. 2023 జూలై 1 నుంచి నూతన పీఆర్సీని అమలుచేయాలని, 33.67 శాతం కరువుభత్యంతో కలిపి అందజేయాలని విజ్ఞప్తి చేసింది. పీఆర్సీ కమిటీ ఆహ్వానం మేరకు టీఎన్జీవో కేంద్రం సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సోమవారం బీఆర్కేభవన్లో పీఆర్సీ కమిటీ చైర్మన్ ఎన్ శివశంకర్, సభ్యుడు రామయ్యతో చర్చించింది. ఉద్యోగుల కనీసం వేతనం రూ. 35వేలు, గరిష్ఠ వేతనం రూ. 2,99,100గా ఖరారు చేయాలని టీఎన్జీవో నేతలు కోరారు. సీపీఎస్ను రద్దుచేసి, పాత పింఛను విధానం(ఓపీఎస్)ను కొనసాగించాలని విజ్ఞప్తిచేశారు.
హెచ్ఆర్ఏ జీహెచ్ఎంసీలో 27శాతం, 2లక్షలకు పైగా జనాభా ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లలో 18.5శాతం, 50వేల కంటే ఎక్కువగా ఉంటే 14శాతం, మిగతా ప్రాంతాల్లో 11.5శాతం చెల్లించాలని, ఆటోమెటిక్ అడ్వాన్స్మెంట్ స్కీంను 5,10,15,20,25 ఏండ్లకు ఇవ్వాలని, కనీన పెన్షన్ను రూ.9,500 నుంచి రూ. 17,500లకు పెంచాలని, రిటైర్మెంట్ గ్రాట్యుటీ రూ.116 లక్షల నుంచి రూ.24 లక్షలకు పెంచాలని కోరారు. ఉద్యోగులు, పెన్షనర్లు చనిపోతే దహనఖర్చుల కింద రూ. 75 వేలు ఇవ్వాలని, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్ స్కేళ్లను ధరల ఆధారంగా పెంచాలని పలు ప్రతిపాదనలను పీఆర్సీ కమిటీ ముందుంచారు. ఈ భేటీలో టీఎన్జీవో కేంద్ర సంఘం అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు, ముత్యాల సత్యనారాయణగౌడ్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎండీ ముజీబ్ హుస్సేని, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్, కొండల్రెడ్డి, గోవర్ధన్రెడ్డి ఉన్నారు.