హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 13 : మాదిగలకు టికెట్ ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందని టీ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బొట్ల భిక్షపతి మాదిగ విమర్శించారు. మాదిగలకు ఎంపీ టికెట్ ఇవ్వపోతే 17 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ను ఓడిస్తామని హెచ్చరించారు. శనివారం హనుమకొండలోని ప్రెస్క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వాతంత్య్రం సిద్ధించి 76 సంవత్సరాలైనా కాంగ్రెస్ పార్టీ మాదిగలను గుర్తించడంలో విఫలమైందని అన్నారు.
రాష్ట్రంలో 90 లక్షల మంది మాదిగలుంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 9 లక్షల మంది ఉన్నారని, మాలల ఉపకులాలకు మాత్రమే టికెట్లు ఇచ్చి మాదిగలకు ద్రోహం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను పల్లెల్లోకి రానివ్వకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా ఉండగా ఆయన కూతురికి ఎంపీ టికెట్ ఎందుకిచ్చారని ప్రశ్నించారు. కాంగ్రెస్ను ఓడించడానికి సిద్ధం కావాలని ఆయన మాదిగలకు పిలుపునిచ్చారు.