ఖైరతాబాద్, మే 28: తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన టీజేఎఫ్ రజతోత్సవాల పోస్టర్ను మీడియా అకాడమీ మాజీ చైర్మన్, ఫోరం అధ్యక్షుడు అల్లం నారాయణ, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతీ సాగర్ ఆవిష్కరించారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో జరిగిన ఈ కార్యక్రమంలో అల్లం నారాయణ మాట్లాడుతూ.. తెలంగాణ మలి దశ ఉద్యమంలో మొదలైన టీజేఎఫ్ ప్రస్తానం.. ప్రత్యేక రాష్ర్టావిర్భావం తర్వాత కూడా టీయూడబ్ల్యూజేగా జర్నలిస్టుల సమస్యలపై పోరాడుతున్నదని చెప్పారు.
ఉద్యమకాలంలో సాగరహారం మొదలు మిలియన్ మార్చ్ వరకు, ఆపై తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టే సమయంలో టీజేఎఫ్ పోషించిన పాత్ర చరిత్రాత్మకమని తెలిపారు. ఈ నెల 31న జలవిహార్లో జరిగే రజతోత్సవ వేడుకల్లో నాడు టీజేఎఫ్తో కలిసి నడిచిన అన్ని పార్టీల నాయకులు, ఉద్యోగ, ప్రజా సంఘాలు, మేధావులు పాల్గొంటారని వెల్లడించారు. ఈ వేడుకలు ఏడాదిపాటు కొనసాగుతాయని, 2026 మే 31న ముగింపు సందర్భంగా జర్నలిస్టులు, టీజేఎఫ్ ఉద్యమ ప్రస్తానంపై పుస్తకావిష్కరణ ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సంఘం కార్యదర్శి ఏ రమణకుమార్, ఐజేయూ నేత అవ్వారి భాస్కర్, టీయూడబ్ల్యుజే రాష్ట్ర కోశాధికారి పీ యోగానంద్, సహాయ కార్యదర్శి యార నవీన్కుమార్ తదితరులు పాల్గొన్నారు.