తొర్రూరు, సెప్టెంబర్ 19: పాలకుర్తి నియోజకవర్గం టికెట్ కోసం.. కాంగ్రెస్లో ఇద్దరు ఎన్నారైల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్నది. టికెట్ తనదంటే తనదని ఎవరికి వారు ప్రచారాలు చేసుకుంటున్నారు. ఝాన్సీరెడ్డి కొద్ది రోజులుగా గ్రామాల్లో పర్యటిస్తూ కాంగ్రెస్ శ్రేణులతో సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో.. పీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ ఎర్రంరెడ్డి తిరుపతిరెడ్డి.. తాను కూడా పాలకుర్తి నుంచి పోటీ చేస్తాను.. అసలు ఝాన్సీరెడ్డి అమెరికా పౌరసత్వం రద్దు చేసుకోకుండా ఇక్కడి నుంచి ఎలా పోటీ చేస్తారని బహిరంగ విమర్శలు ఎక్కుపెట్టడంతో గొడవలు ప్రారంభమయ్యాయి.
స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకత్వం ఝాన్సీరెడ్డికే మద్దతు ఇస్తున్నది. ఈ క్రమంలో తిరుపతిరెడ్డి ఎక్కడికి వచ్చి సమావేశం నిర్వహించినా గొడవలు జరుగుతున్నాయి. ఝాన్సీరెడ్డి వర్గీయులు తాజాగా సోమవారం తొర్రూరు మండలం అమ్మాపురంలో ‘తుక్కుగూడ విజయభేరి సభ ఆరు గ్యారంటీలు’పై అవగాహన కల్పించేందుకు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఈ ఇద్దరు నేతలు హాజరయ్యారు. తొర్రూరు పార్టీ పరిశీలకుడు, తమిళనాడు సీఎల్పీ నేత సెల్వ పెరంతాంగై ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన ముందే అమ్మాపురం కాంగ్రెస్ శ్రేణులు తిరుపతిరెడ్డిపై తిరుగుబాటు చేశారు.
ఊరి నుంచి వెళ్లిపోవాలని నినాదాలు చేశారు. గత్యంతరం లేక తిరుపతిరెడ్డి తన అనుచరులతో కలిసి గ్రామ పొలిమేర వరకు వెళ్లారు. ఆ తర్వాత తొర్రూరు గెస్ట్హౌస్లో మీడియా సమావేశం నిర్వహిస్తున్న సందర్భంలోకూడా తిరుపతిరెడ్డికి కుర్చీ వేయవద్దని ఝాన్సీరెడ్డి వర్గీయులు కుర్చీ లాగేశారు. పార్టీ పరిశీలకులు ఈ పరిస్థితిని చూసి రెండే నిమిషాలు మాట్లాడి వెళ్లిపోయారు. అనంతరం ఇరువురు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొన్నది. కార్యకర్తల కొట్లాటను తిరుపతిరెడ్డి, ఝాన్సీరెడ్డి చూస్తూ ఉండిపోయారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి అందరినీ అక్కడి నుంచి పంపించడంతో గొడవ సద్దుమణిగింది.