హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): తిరుమల తిరుపతి ప్రసాదం భక్తులకు త్వరలోనే బయోకంపోస్టబుల్ కవర్లలో అందనున్నది. కూరగాయల వ్యర్థాలు, స్టార్చ్, కూరగాయల నుంచి తీసిన ఆయిల్స్తో పర్యావరణహితంగా డీఆర్డీవో రూపొందించిన బయోకంపోస్టబుల్ బ్యాగ్ల వినియోగానికి టీటీడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు టీటీడీ ఈవో అంగీకరించినట్టు డీఆర్డీవో అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ల్యాబోరేటరీ (ఏఎస్ఎల్) డైరెక్టర్ ఎం రామ మనోహర్బాబు వెల్లడించారు. డీఆర్డీవో ఏఎస్ఎల్ శాస్త్రవేత్తలు.. ఆచార్య నాగార్జున వర్సిటీ, ఎకోలాస్టిక్ ప్రొడక్ట్స్ ప్రైవేటు లిమిటెడ్ సంయుక్త సహకారంతో వీటిని రూపొందించినట్టు తెలిపారు. శుక్రవారం చర్లపల్లిలోని ఎకోలాస్టిక్ పరిశ్రమలో నిర్వహించిన కార్యక్రమంలో కంపోస్టబుల్ బ్యాగ్ల ఉత్పత్తిని ఎం రామ మనోహర్బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ భూమిలో కలిసేందుకు వెయ్యేండ్లు పడుతుందని, డీఆర్డీవో ఏఎస్ఎల్ రూపొందించిన వందశాతం కంపోస్టబుల్ ఉత్పత్తులు 80 నుంచి 90 రోజుల్లోనే భూమిలో పూర్తిగా కలిసిపోతాయని వెల్లడించారు. డీఆర్డీవో ఫార్ములాతో ఎకోలాస్టిక్ కంపెనీ.. నీటిలో కరిగేవి, వాటర్రెసిస్టెంట్ అనే రెండు రకాల కంపోస్టబుల్ కవర్లను రూపొందించినట్టు డీఆర్డీవో శాస్త్రవేత్త వీరబ్రహ్మం తెలిపారు. కార్యక్రమంలో ఎకోలాస్టిక్ కంపెనీ సీఎండీ ఓంకార్ దుగ్గల్, డైరెక్టర్ రజినీకాంత్, స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.