హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సామాన్యులకు పెద్దపీట వేస్తున్నామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. వాహన సేవలతోపాటు సంతృప్తికరంగా శ్రీవారి దర్శన టికెట్లు కేటాయిస్తున్నామని, అన్ని రకాల ప్రివిలేజ్డ్ దర్శనాలు రద్దు చేస్తున్నామని తెలిపారు. శుక్రవారం ధర్మారెడ్డి తిరుమలలో విలేకరులతో మాట్లాడారు. త్వరలో తిరుచానూరులో మహా వరుణయాగం ఉంటుందని చెప్పారు. అష్ట వినాయక అతిథిగృహంలో గదులను సాధారణ భక్తులకు కేటాయిస్తున్నట్టు చెప్పారు. వికాస్ నిలయాన్ని ఆధునీకరించి భక్తులకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు.
స్వామివారి అభిషేకానికి కావాల్సిన నెయ్యి తిరుపతి గోశాల నుంచే వస్తున్నదని, వచ్చే ఏడాదికి గోశాలలో నెయ్యి ప్లాంట్ సిద్ధం చేస్తామని వెల్లడించారు. ఆగస్టు నెలలో శ్రీవారిని 22.25 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని, హుండీ ఆదాయం రూ.120.085 కోట్లు వచ్చిందని, 9.07 లక్షల మంద్రి తలనీలాలు సమర్పించారని, 1.09 కోట్ల లడ్డూలు విక్రయించామని, 43.07 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారని ఈవో వివరించారు.