హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ) : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) హుండీలో కాసుల వర్షం కురుస్తున్నది. మార్చి నెలలో కూడా భారీగా ఆ దాయం సమకూరింది. నిరుటి నుంచి స్వామివారి ఆదాయం ప్రతి నెలా రూ. 100 కోట్లకుపైగా సమకూరుతూ వస్తున్నది. ఈ క్రమంలో మార్చి నెలలో తిరుమల హుండీ ఆదాయం రూ.120.29 కోట్లుగా తేలింది. దీంతో 2022-23 ఆర్థిక సంవత్సరానికి తిరుమల తిరుపతి దేవస్థానం హుండీ ఆదాయం రూ. 1,520.29 కోట్లు లభించిందని టీటీడీ వెల్లడించింది. 2022 జనవరి నుంచి డిసెంబర్ వరకు 2.37 కోట్ల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.
వార్షిక బడ్జెట్ 4,411.68 కోట్లు
తిరుమల తిరుపతి దేవస్థానం 2023-24 సంవత్సరానికి రూ. 4,411.68 కోట్లతో బడ్జెట్ను రూపొందించినట్టు టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు. శనివారం ఫీడ్మిక్సింగ్ ప్లాంట్, అగరబత్తీల రెండో ప్లాంట్ను ఆయన ప్రారంభించారు. రోజూ దేవస్థానానికి అవసరమయ్యే 3వేల నుంచి 4 వేల లీటర్ల పాలను స్థానికంగానే ఉత్పత్తి చేయాలనుకున్నామని తెలిపారు. గోవులకు అవసరమయ్యే దాణా కోసం రూ.11 కోట్లతో ఈ ప్లాంట్ నిర్మించామన్నారు.