ఆసిఫాబాద్: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి కలకలం సృష్టిస్తున్నది. గతకొన్ని రోజులుగా జిల్లాలోని పలు గ్రామాల్లో సంచరిస్తున్న పులి.. తాజాగా బెజ్జూరు మండలంలో కుకుడా గ్రామంలో ఎద్దుపై దాడి చేసింది. దీంతో అది తీవ్రంగా గాయపడింది. సోమవారం తెల్లవారుజామున గుర్తించిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. పులి తిరుగుతుండటంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. వీలైనంత తొందరగా పులిని పట్టుకోవాలని అధికారులను కోరుతున్నారు. ఆదివారం బాబాసాగర్ ఏరియా కుంట వద్ద స్థానికులకు పులి కనిపించింది.
కాగా, రెండు రోజుల క్రితం కాగజ్నగర్ మండలంలోని వేంపల్లి – అనుకోడ గ్రామ శివారులో పెద్దపులి కొందరు ప్రయాణికులకు కనిపించింది. పులాస్ సర్దార్ అనే వ్యక్తి ఇంటి ఆవరణలోకి వచ్చిన కొద్దిసేపటి తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయింది. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు పులి పాదముద్రలు గుర్తించారు. ఖానాపూర్, కాగజ్ నగర్, ఈజ్ గాం మీదుగా పెద్దపులి వేంపల్లికి చేరుకుందన్నారు. దాని ఆచూకీ కోసం 12 బృందాలు గాలిస్తున్నాయని చెప్పారు.
ఇటీవల ములుగు జిల్లాలోని తాడ్వాయి, మంగపేట మండలాల్లో మూడు రోజులుగా పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. తాడ్వాయి మండలంలోని కామారం అటవీ ప్రాంతంలో పశువుల మంద పైకి దాడికి యత్నించింది. మంగపేట మండలంలో లేగపై దాడి చేసి చంపింది. మేత కోసం తాడ్వాయి మండలం కామారం అడవికి తోలుకెళ్లిన బర్రెల మందపై పెద్ద పులి దాడికి యత్నించింది. అది చూసిన పశువుల కాపరి పులి రమేశ్ భయంతో కేకలు వేశాడు. దాంతో పులికి అక్కడి నుంచి పారిపోయింది.