రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ) : రాజన్న సిరిసిల్ల జిల్లా మానాల అటవీ ప్రాంతంలోని ఓ మట్టి దారిలో పాతిపెట్టిన టిఫిన్ బాక్స్ కలకలం రేపింది. అప్రమత్తమైన పోలీసులు జాగిలాలు, బాంబ్ స్కాడ్తో వెళ్లి తనిఖీలు చేశారు. జేసీబీతో తవ్వి తీశారు. దాన్ని తెరిచి చూడగా అందులో నల్లకోడి దర్శనమివ్వడంతో నివ్వెరపోయారు. కోనరావుపేట మండలం మరిమడ్ల పరిధిలోని మానాల అటవీ ప్రాంతంలో ఓ మట్టి దారి లో పాతిపెట్టిన టిఫిన్ బాక్సును ఓ కుక్క తోడుతున్న దృశ్యాన్ని అటవీశాఖ ఉద్యోగి చూశాడు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చాడు. గతంలో ఈ ప్రాంతం మావోయిస్టులకు కంచుకోట కావడం, ఇటీవల ఛత్తీస్గఢ్లో ల్యాండ్మైన్లు పేల్చిన ఘటనలను పరిగణలోకి తీసుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎస్పీ రాహుల్హెగ్డే ఆదేశాల మేరకు జాగిలాలు, బాంబ్ స్కాడ్తో ఘటనాస్థలికి వెళ్లారు. టిఫిన్ బాక్సును మెటల్ డిటెక్టర్తో పరిశీలించి నక్సల్స్ అమర్చిన ల్యాండ్ మైన్గా అనుమానించారు. జేసీబీతో జాగ్రత్తగా తవ్వించారు. మూడు గంటలపాటు శ్రమించి టిఫిన్ బాక్స్ను భూమిలో నుంచి తీశారు. జాగ్రత్తగా మూత తీసేసరికి అందులో నల్లకోడి, కొబ్బరికాయ, నిమ్మకాయలు కనిపించడంతో పోలీసులు నివ్వెరపోయారు. మంత్రాల నెపంతో ఎవరో టిఫిన్ బాక్సులో వాటిని పెట్టి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.