హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): క్షయ వ్యాధి (టీబీ) నిర్మూలనకు చేస్తున్న విశేష కృషికి గుర్తింపుగా రాష్ట్రంలోని మూడు జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం పతకాలు బహూకరించింది. ప్రపంచ టీబీ నిర్మూలన దినోత్సవం సందర్భంగా గురువారం ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లాకు వెండి పతకం, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు కాంస్య పతకాలను బహూకరించారు. అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ వాకాటి కరుణ, రాష్ట్ర టీబీ నిర్మూలన కార్యక్రమం జాయింట్ డైరెక్టర్ రాజేశం, నిజామాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల టీబీ ప్రోగ్రాం అధికారులు సుదర్శనం, సుబ్బారావు, శ్రీనివాస్, డబ్ల్యూహెచ్వో బృంద సభ్యులు ఆచంట శాంత, గొర్ల మహేశ్, శ్రిగణ, సుష్మ పాల్గొన్నారు. జాతీయ టీబీ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో ఇటీవల కేంద్ర ప్రభుత్వం ‘సబ్ నేషనల్ టీబీ ఫ్రీ సర్టిఫికేషన్’ (ఎస్ఎన్సీ) సర్వే నిర్వహించింది. 2015 నుంచి 2021 మధ్య కేసుల నమోదును పరిశీలించింది. టీబీ కేసుల సంఖ్య 80 శాతం తగ్గితే ఆ జిల్లాను టీబీ రహితంగా ప్రకటిస్తారు.
మూడు జిల్లాలకు జాతీయ అవార్డులు రావడం తో వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు హర్షం వ్యక్తంచేశారు. ఇందుకు కృషిచేసిన వైద్య సిబ్బందికి అభినందనలు తెలిపారు. అన్ని జిల్లాలు వీటిని ఆదర్శంగా తీసుకొని, టీబీని రూపుమాపేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.