జ్యోతినగర్, ఏప్రిల్ 14: సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు ప్రమాదవశాత్తు చెరువులో మునిగి ప్రాణాలు వదిలారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధి రెండో డివిజన్ ఎన్టీపీసీ పీకే రామయ్యకాలనీ శివారులోని మేడిపల్లి చెరువులో శుక్రవారం చోటుచేసుకున్నది. ఎన్టీపీసీ మూడో డివిజన్ న్యూపోరట్పల్లికి చెందిన మేకల సాయిచరణ్ (13), సోయం ఉమామహేశ్ (13), మామిడి విక్రమ్ (13) పీకే రామయ్యకాలనీ శివారులోని మేడిపల్లి చెరువుకు ఈత కోసం వెళ్లారు. చెరువులో దిగిన వారు ప్రమాదవశాత్తు అందులో మునిగిపోయారు. అటుగా వెళ్తున్న ఓ బాలుడు గమనించి స్థానికులకు తెలిపాడు. స్థానికులతోపాటు ఎన్టీపీసీ పోలీసులు అక్కడికి చేరుకొని ముగ్గురు విద్యార్థులను ఒడ్డుకు తీసి గోదావరిఖని ప్రభుత్వ ఏరియా దవాఖానకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే వారు మృతిచెందినట్టు ధ్రువీకరించారు. దీంతో చిన్నారుల కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.