హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ హైకోర్టుకు మరో ముగ్గురు కొత్త న్యాయమూర్తులు రాబోతున్నారు. జిల్లా జడ్జిల క్యాడర్ నుంచి ఒకరు, న్యాయవాదుల కోటా నుంచి ఇద్దరి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. గత ఏడాది అక్టోబర్ 23న న్యాయాధికారి సుజన కళాసికం, డిసెంబర్ 22న ఇద్దరు న్యాయవాదులు లక్ష్మీ నారాయణ అలిశెట్టి, అనిల్ కుమార్ జూకంటిని న్యాయమూర్తులుగా నియమించాలని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టుకు ప్రతిపాదించారు. ఈ పేర్లకు గవర్నర్, సీఎం సైతం ఆమోదం తెలిపారు. బుధవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజయ్ కౌశల్, జస్టిస్ సంజీవ్ఖన్నాతో కూడిన కొలీజియం ఈ పేర్లకు ఆమోదముద్ర వేస్తూ కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. కొలీజియం సిఫారసును కేంద్రం ఆమోదించి రాష్ట్రపతికి నివేదించాల్సి ఉంటంది. రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే ఆ ముగ్గురూ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులవుతారు. నల్లగొండ జిల్లా ఆలేరుకు చెందిన సుజన 2010లో జడ్జిగా ఎంపికయ్యారు. నిజామాబాద్, కరీంనగర్ జిల్లా జడ్జిగా, హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జడ్జిగా చేశారు. జ్యుడీషియల్ అకాడమి డైరెక్టర్గా చేశారు. ఏడాదిగా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్గా పని చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా మెండోరా మండల కేంద్రానికి చెందిన అలిశెట్టి లక్ష్మీనారాయణ 1994లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. పలు సంస్థలకు స్టాండింగ్ కౌన్సిల్గా పని చేస్తున్నారు. సివిల్, రాజ్యాంగ పరమైన కేసులు వాదించిన అనుభవం ఉంది. లక్ష్మీనారాయణ, అనిల్ హైకోర్టు న్యాయవాదులుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. వీళ్ల నియామకం జరిగితే హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 26 నుంచి 29కి పెరుగుతుంది. కొత్త ప్రధాన న్యాయమూర్తి వస్తే ఆ సంఖ్య 30కి పెరుగుతుంది. ఇటీవలే జస్టిస్ కన్నెగంటి లలితను కర్ణాటక హైకోర్టుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆమె బదిలీ జరిగితే హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 29 అవుతుంది.