హైదరాబాద్ సిటీబ్యూరో/నాంపల్లి కోర్టులు, మే 24 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో బుధవారం సిట్ మరో ముగ్గురిని అరెస్టు చేసింది. దీంతో నిందితులు సంఖ్య 40కి, అరెస్టులు 39కి చేరాయి. ఈ కేసులో ప్రధాన నిందితులైన ప్రవీణ్కుమార్, రాజశేఖర్రెడ్డి ద్వారా ప్రశ్నపత్రాలు అందుకున్న సురేశ్ తాను నివాసముండే అపార్టుమెంట్లో ముగ్గురికి ఏఈ, డీఏవో పేపర్లు అందించాడు. టీఎస్పీఎస్సీ మాజీ ఉద్యోగి అయిన సురేశ్ 12వ నిందితుడిగా గతంలోనే అరెస్టయ్యాడు. నల్లగొండ జిల్లా నకిరేకల్లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న పూల రవికిశోర్ మధ్యవర్తిగా ఉంటూ సురేశ్ వద్ద నుంచి ఏఈ పేపర్ను పొందాడు. తన బావమరిది కార్ డ్రైవర్గా పనిచేస్తున్న రాయపురం విక్రమ్కు, అతని సోదరి రాయపురం దివ్వకు డీఈవో(డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్) ప్రశ్నపత్రాలు ఇప్పించాడు. ఈ ముగ్గురు సురేశ్ నివాసం ఉండే సైదాబాద్లోని అపార్టుమెంట్లోనే ఉంటారు. రవికిశోర్, దివ్య, విక్రమ్ను సిట్ అరెస్టు చేసింది.
దంపతులకు బెయిల్ మంజూరు
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సాయి లౌకిక్, సుస్మిత దంపతులకు ఇంచార్జి జువెనైల్ కోర్టు మెజిస్ట్రేట్ జీ రాధిక బెయిల్ మంజూరు చేశారు. 50 వేల పూచీకత్తుతో ఇద్దరి జమానత్లను, పాస్పోర్టులను కోర్టుకు సమర్పించాలని, సిట్ విచారణకు సహకరించాలని ఆదేశించారు. తండ్రి మైబయ్య, కొడుకు జనార్దన్, అన్నదమ్ములు కోస్గి రవికుమార్, కోస్గి భగవంత్కుమార్ వేసిన బెయిల్ పిటిషన్లను కొట్టివేశారు. ప్రధాన నిందితుడు ప్రవీణ్కుమార్ తరఫున బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బుధవారం మరో ఆరుగురిని సిట్ అధికారులు కస్టడీకి తీసుకున్నారు.