హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 18 (నమస్తే తెలంగాణ): మీపై చీటింగ్ కేసు నమోదైందా? అరెస్టు నుంచి తప్పించుకోవాలనుకుంటున్నారా? మీరు మా చేతులు తడిపితే చాలు అరెస్టును తప్పించేస్తాం అంటున్నారు ముగ్గురు ఖాకీలు. చైతన్యపురి పోలీస్స్టేషన్ అడ్డాగా లంచాలతో చెలరేగిపోతున్నారు. చైతన్యపురి పోలీస్స్టేషన్లో పనిచేసే మల్లేశం (కానిస్టేబుళ్లు), ప్రసాద్బాబు (హెడ్ కానిస్టేబుల్, వారెంట్ ఎగ్జిక్యూషన్ టీమ్), ఎం నరేందర్ (కానిస్టేబుల్, కోర్టు విధులు నిర్వహించే టీమ్), మరో నలుగురు ప్రైవేట్ వ్యక్తులు సోమశేఖర్, రామకృష్ణ, ఏవీఎన్ఏసీ కుమార్ అచ్చుతున అలియాస్ చైతన్య, రాఘవేందర్ గుప్తతో కలిసి ముఠాగా ఏర్పడ్డారు.
2022లో మేనేజ్మెంట్ కోటాలో మెడికల్ సీట్లు ఇప్పిస్తానని మోసాలకు పాల్పడిన అంగె వెంకటరమణపై చైతన్యపురి ఠాణాలో రెండు చీటింగ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో వెంకటరమణ కోర్టుకు హాజరుకాకపోవడంతో న్యాయస్థానం వారెంట్లు జారీ చేసింది. ఈ ముఠా వెంకటరమణను కలిసింది. ‘నీపై వారెంట్లు జారీ అయ్యాయి. నిన్ను అరెస్టు చేసి ఇప్పుడే తీసుకెళ్తాం. వారెంట్లను పక్కన పెట్టాలంటే రూ.5 లక్షలు ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు. అందులో రూ.3 లక్షలు తన తండ్రి బ్యాంకు ఖాతా నుంచి ప్రైవేట్ వ్యక్తుల ద్వారా వెంకటరమణ కానిస్టేబుళ్లకు పంపించాడు. మరికొంత సొమ్మును కూడా పలు దఫాలుగా అందించాడు. అయినా వారెంట్ సాకుతో బెదిరిస్తూ ఇంకా డబ్బులు ఇవ్వాలని వేధిస్తున్నారు. ఈ ముఠా వేధింపులు తాళలేక వెంకటరమణ ఏసీబీని ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు.. ముగ్గురు కానిస్టేబుళ్లతోపాటు నలుగురు ప్రైవేట్ వ్యక్తులను గురువారం అరెస్టు చేశారు.