నిర్మల్ : నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం గొడిశార్ల గ్రామంలోని శ్రీ రాజ రాజేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం అర్ధరాత్రి నాగుపాము ప్రత్యక్షమైంది. దీంతో భక్తులు ఆ నాగుపాముకు పూజలు చేశారు. ఆలయంలోని గర్భగుడిలోకి నాగు పాము ప్రవేశించిందని భక్తులకు తెలియడంతో పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చారు. తమ కెమెరాల్లో బంధించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. అయితే నాగుపామును చూసేందుకు భక్తులు భారీగా తరలిరావడంతో.. వారిని కంట్రోల్ చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.
ఈ సందర్భంగా ఆలయ పూజారి లక్ష్మణ్ స్వామి మాట్లాడుతూ.. గత ఐదేండ్ల నుంచి శివరాత్రి పర్వదినం నాడు ఆలయ గర్భగుడిలోకి నాగుపాము వచ్చి పూజలు అందుకుంటుందని తెలిపారు. ఈ క్రమంలో భక్తులు ఆ పాముకు ప్రత్యేక పూజలు చేసి తమ భక్తిని చాటుకుంటున్నారని చెప్పారు.