హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): అస్సాంలో ఉండాల్సిన ఆరు ఆధార్ కేంద్రాలు అవి.. సాఫ్ట్వేర్ లొకేషన్ మార్చి అక్రమంగా హైదరాబాద్లో నిర్వహించిందో ముఠా. అసలైన ఆధార్ డాటాబేస్ను వాడుకొని, అనర్హులకు కూడా ఆధార్ కార్డులు ఇచ్చింది. ప్రభుత్వ పథకాలకు కావాల్సిన అర్హత పత్రాలను కూడా తయారుచేస్తూ రెండు నెలలుగా 3 వేల ఆధార్ కార్డులు జారీ చేసింది. ఇతర దేశాల నుంచి అక్రమంగా వచ్చి తిష్టవేసిన రోహింగ్యాలకు కూడా ఈ ముఠా ఆధార్కార్డులు జారీ చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను శుక్రవారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకిషన్రావుతో కలిసి మీడియాకు వెల్లడించారు. బోరబండకు చెందిన నితీశ్సింగ్కు మధ్యప్రదేశ్కు చెందిన పవన్ స్నేహితుడు. పవన్ అస్సాంలో ఆధార్ ఏజెన్సీలో ఔట్సోర్సింగ్ ఉద్యోగం చేస్తున్నాడు. టోలీచౌకీకి చెందిన సయ్యద్ ముస్తఫా నేతృత్వంలో కాచిగూడకు చెందిన రబ్బానీ, మహ్మద్ అజహార్ షరీఫ్, మహ్మద్ సోహైల్, షేక్ జహాంగీర్ పాషా, మహ్మద్ అన్వరుద్దీన్, మహ్మద్ అహ్మద్ ఆన్లైన్ సర్వీసులను నిర్వహిస్తున్నారు. వీరికి కూడా నితీశ్ సింగ్ స్నేహితుడు. పవన్ సహాయంతో ముస్తఫాకు ఆధార్ సెంటర్ల ఐడీలు ఇప్పించి, రోజుకు రూ.3 వేలు చెల్లించేలా ఒప్పందం చేసుకొన్నాడు. అక్టోబర్లో పవన్ నుంచి ఆరు ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడీలు, ఆధార్ కిట్స్(ల్యాప్టాప్, ఐరిస్, ఫింగర్ ప్రింట్, కెమెరా)ను రూ.90 వేలకు ఇప్పించాడు. ఆ ఆరు ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడీలు అస్సాంలో మాత్రమే ఉపయోగించాలి. కానీ, లొకేషన్ మార్చి వీళ్లంతా హైదరాబాద్లో కార్యకలాపాలు నిర్వహించారు. ఆధార్ కార్డుల ఎన్రోల్మెంట్, మార్పులు, చేర్పులు చేపట్టారు. ఈ ముఠా జనన ధ్రువీకరణ, ఇతర పత్రాలు ఫోర్జరీ చేసి జారీ చేశారు. జీహెచ్ఎంసీ నుంచి అసలైన ధ్రువపత్రాలను తీసుకొని, అదే ఫార్మాట్లో కావాల్సిన వాళ్లకు పేర్లు, పుట్టిన రోజు, అడ్రస్లను మార్చి ఇచ్చారు. ప్రభుత్వ వైద్యుల గెజిటెడ్ స్టాంప్ సంతకాలను ఉపయోగించారు. పనిని బట్టి రూ.2వేల నుంచి రూ.3 వేలు వసూలు చేశారు. అలా.. ఇక్కడి నుంచి ఆధార్ కార్డులు పొందినవాళ్లు షాదీముబారక్, ఇతర ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకొన్నట్టు పోలీసుల విచారణలో తేలింది.
అస్సాంలో ఉండాల్సిన ఆధార్ ఐడీలు వేరే చోటు నుంచి నిర్వహిస్తున్నట్టు అనుమానించిన ఆధార్ నిర్వహణ సంస్థ దర్యాప్తు చేసింది. లోకేషన్ మార్చేసినట్టు తెలుసుకొని, వాటి వాస్తవ లొకేషన్ హైదరాబాద్లో ఉందని గుర్తించారు. యూఐడీఏఐ ఇచ్చిన ఫిర్యాదుతో బంజారాహిల్స్, గోల్కొండ పోలీస్స్టేషన్లలో రెండు కేసులు నమోదయ్యాయి. టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకిషన్రావు నేతృత్వంలో దర్యాప్తు చేయగా.. 8 మంది ముఠా సభ్యులు పట్టుబడ్డారు. 6 ఆధార్ కిట్లు, నకిలీ స్టాంప్లు, నకిలీ బర్త్ సర్టిఫికెట్లు, నకిలీ ఆధార్కార్డులు, రూ.80 వేల నగదును స్వాధీనం చేసుకొన్నారు. మధ్యప్రదేశ్కు చెందిన పవన్ పరారీలో ఉన్నాడు. ఈ ముఠా ఎన్రోల్ చేసిన 3 వేల ఆధార్ కార్డులను యూఐడీఏఐ రద్దు చేస్తుందని సీపీ తెలిపారు. కేసు తదుపరి విచారణను గోల్కొండ పోలీసులకు అప్పగించారు.